రాష్ట్ర హైకోర్టుకు.. మరో ఇద్దరు న్యాయమూర్తులు
ABN , First Publish Date - 2021-12-07T07:51:14+05:30 IST
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు నియమితులయ్యారు. న్యాయవాది కె.మన్మథరావు,..
జస్టిస్ మన్మథరావు, జస్టిస్ భానుమతి
నియామకానికి రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు నియమితులయ్యారు. న్యాయవాది కె.మన్మథరావు, హైకోర్టు రిజిస్ట్రార్ బీఎస్ భానుమతిని న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు. ఈ మేరకు సోమవారం కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నియామకంతో రాష్ట్ర హైకోర్టు జడ్జీల సంఖ్య ప్రధాన న్యాయమూర్తి కాకుండా 19కి చేరింది. అలాగే ఈ ఏడాది ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులకు నియమించిన న్యాయమూర్తుల సంఖ్య 120కి చేరుకుంది. 2016లో ఒకే ఏడాది 126 హైకోర్టు జడ్జీలను నియమించడం రికార్డు. కాగా.. 164 మంది హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రతిపాదనలు వివిధ దశల్లో కొలీజియం, కేంద్రప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు ఇటీవల రాజ్యసభలో చెప్పారు.