అంతా ఉత్తిదేనా!
ABN , First Publish Date - 2021-03-09T09:37:27+05:30 IST
సీఎం సారు ఢిల్లీకి వెళ్తున్నారు... వస్తున్నారు! కానీ... ఆయన పోలవరం గురించీ అడగడంలేదు. మూడు రాజధానుల్లో భాగంగా కర్నూలుకు హైకోర్టు తరలింపుపైనా వినతి పత్రాలు ఇవ్వడం లేదు. కానీ, అలా
పోలవరానికి రూ.55వేల కోట్లు అడగలేదు
సవరించిన అంచనాల ఆమోదం కోరలేదు
రాజ్యసభకు కేంద్ర మంత్రి కటారియా జవాబు
ఉత్తుత్తి లీకులతో మభ్యపెడుతున్న రాష్ట్ర సర్కారు
గతంలో కర్నూలుకు హైకోర్టుపైనా ఇదే తంతు
కేంద్రాన్ని కోరకున్నా కోరినట్లుగా ‘సమాచారం’
అమిత్షాకు జగన్ వినతి పత్రాలేవీ ఇవ్వలేదు
(న్యూఢిల్లీ-ఆంధ్రజ్యోతి)
సీఎం సారు ఢిల్లీకి వెళ్తున్నారు... వస్తున్నారు! కానీ... ఆయన పోలవరం గురించీ అడగడంలేదు. మూడు రాజధానుల్లో భాగంగా కర్నూలుకు హైకోర్టు తరలింపుపైనా వినతి పత్రాలు ఇవ్వడం లేదు. కానీ, అలా అడిగినట్లుగా, కేంద్ర హోంమంత్రికి వినతిపత్రాలు ఇచ్చినట్లుగా మీడియాకు ‘లీకులు’ మాత్రం ఇస్తున్నారు. ఇది వారూ వీరూ చెప్పిన సంగతి కాదు! స్వయంగా కేంద్ర మంత్రులే పార్లమెంటు వేదికగా సాధికారికంగా చెప్పిన సమాధానాలు! కర్నూలుకు హైకోర్టు తరలింపు గురించి ముఖ్యమంత్రి జగన్.. కేంద్ర హోంమంత్రి అమిత్షాకు కొత్తగా ఎలాంటి వినతిపత్రం ఇవ్వలేదని ఇది వరకే వెల్లడైంది.
‘‘ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్చాలని 2020 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి నుంచి ప్రతిపాదన అందింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి నిర్ణయించుకోవాల్సిన విషయం’’ అని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గత నెల 4వ తేదీన స్పష్టం చేశారు. అంటే... ఇదేదీ తేలకుండానే ‘నోటిఫికేషన్ జారీ కోసం వినతిపత్రం’ అంటూ ఉత్తుత్తి హడావుడి చేసినట్లు వెల్లడైంది. డిసెంబరు 16న, జనవరి 19న ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్లినప్పుడు కర్నూలుకు హైకోర్టు తరలింపుపై కేంద్రానికి వినతిపత్రాలు సమర్పించినట్లుగా ప్రభుత్వం ఇచ్చిన లీకులు ‘ఉత్తిదే’ అని తేలిపోయింది. తాజాగా... పోలవరం ప్రాజెక్టుపై సవరించిన అంచనాలు ఆమోదించి, ఆమేరకు నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ కేంద్రాన్ని కోరనే లేదని వెల్లడైంది. సోమవారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రతన్లాల్ కటారియా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘‘పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు సవరించిన అంచనా వ్యయం రూ.55,650 కోట్లు ఆమోదించాలని ముఖ్యమంత్రి జగన్ కేంద్ర హోంమంత్రికి విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం సమర్పించినట్లుగా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు’’ అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
‘‘పోలవరం ప్రాజెక్టు ఇరిగేషన్ విభాగం పనులకింద ఖర్చుచేసిన నిధులను పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు(పీఐపీ), ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) సిఫారసుల మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేస్తుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను నాబార్డు నుంచి రుణం రూపంలో సేకరించిన తర్వాత, ఆ నిధులు పీపీఏకు జమ అవుతాయి. ఆ తర్వాత రాష్ట ప్రభుత్వానికి బదిలీ అవుతాయి. ఈ ప్రక్రియకు ఎలాంటి కాల వ్యవధి ఉండదు’’ అని మంత్రి కటారియా తెలిపారు. 2014 నుంచి 2021 జనవరి వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.12,392.18 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ సాయం కింద రూ.10,848.36కోట్లు ఇప్పటికే విడుదల చేశామని తెలిపారు. ఇదికాకుండా పెండింగ్లో ఉన్న నిధుల నుంచి మరో రూ.1,569.86 కోట్లు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం జనవరి 20న లేఖ రాసినట్లు పేర్కొన్నారు.