కుప్పం వివాదాస్పద నియోజకవర్గం కాదు: చంద్రబాబు
ABN , First Publish Date - 2021-11-09T23:15:09+05:30 IST
స్థానిక సంస్థల గత ఎన్నికలను పోలీసుల సహకారంతో వైసీపీ ప్రహసనంగా మార్చి వేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ అకృత్యాలను అడ్డుకునేందుకు..
అమరావతి: గత స్థానిక సంస్థల ఎన్నికలను పోలీసుల సహకారంతో వైసీపీ ప్రహసనంగా మార్చి వేసిందని ప్రెస్ మీట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ అకృత్యాలను అడ్డుకునేందుకు ఈ సారి మరింత సన్నద్ధంగా వ్యవహరించామన్నారు. ఈ సారి కూడా నామినేషన్లు, విత్ డ్రాలలో అక్రమాలు జరిగాయని తెలిపారు. ‘‘కుప్పం వివాదాస్పద నియోజకవర్గం కాదు...ఇక్కడ గతంలో గొడవలు జరిగిన సందర్భం లేదు. అలాంటి కుప్పంలో దళితులు, BC వర్గాలను ఎన్నికల్లో అడ్డుకున్నారు. కుప్పంలో వెంకటేష్ అనే మా అభ్యర్థి నామినేషన్ను కావాలనే తిరస్కరించారు. అభ్యర్థుల సంతకాలు లేకుండా విత్ డ్రా అయినట్లు ఎలా ప్రకటిస్తారు?. తాము నామినేషన్ వెనక్కి తీసుకోలేదని కుప్పం 14వ వార్డుకు నామినేషన్ వేసిన అభ్యర్థులు మీడియా సమావేశంలో వివరించారు. నామినేషన్లు విత్ డ్రా తరువాత కుప్పంలో ఫైనల్ లిస్ట్ ఎందుకు ప్రకటించలేదు. కుప్పం, నెల్లూరులో ఎన్నికల అధికారుల తీరు దారుణం. ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లలో అక్రమాలు చేసిన అధికారులకు సిగ్గుందా!. మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి చొక్కా చింపి ఈడ్చుకు వెళ్లారు. తప్పు చేసింది కాక... మళ్ళీ టీడీపీ నేతలపై కేసులు పెడతారా.?. నాకు దండ వేశాడని పుంగనూరులో రమణా రెడ్డి అనే వ్యక్తి ప్రహరీ గోడను కూల్చి వేశారు. గోడ కూల్చిన వారిపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు.’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.