కరకచెట్టు పోలమాంబ ఆలయంలో చోరీ
ABN , First Publish Date - 2021-03-22T09:00:33+05:30 IST
విశాఖపట్నంలోని పెదవాల్తేరు ప్రాంతంలో ఉన్న ప్రఖ్యాత కరకచెట్టు పోలమాంబ ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఈ ఘటనలో అమ్మవారికి చెందిన 411.75
412 గ్రా. బంగారం, 4 కిలోల వెండి అపహరణ
విశాఖపట్నం/ పెదవాల్తేరు, మార్చి 21(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని పెదవాల్తేరు ప్రాంతంలో ఉన్న ప్రఖ్యాత కరకచెట్టు పోలమాంబ ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఈ ఘటనలో అమ్మవారికి చెందిన 411.75 గ్రాముల బంగారు నగలు, 4 కిలోల వెండి ఆభరణాలు అపహరణకు గురైనట్టు గుర్తించారు. పోలీసుల కథనం మేరకు... శనివారం రాత్రి భక్తుల దర్శనాలు ముగిసిన తర్వాత అమ్మవారి అలంకరణ ఆభరణాలను పూజారి తీసి, ఈవో కార్యాలయంలోని గదిలో ఉన్న బీరువాలో భద్రపరిచారు. ఆదివారం తెల్లవారుజామున వచ్చిన అర్చకులు శ్రీనివాసచార్యులు, గోశాల సంరక్షకుడు నరేంద్ర.. ఈవో గది తలుపులు గడియలు విరగ్గొట్టి ఉండడాన్ని చూశారు. వెంటనే ఈవో నీలిమకు సమాచారం అందించారు.
ఆమె ఫిర్యాదు మేర కు క్రైమ్ ఏసీపీ డి.శ్రావణ్కుమార్ చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. చోరీకి పాల్పడిన దుండగులు ఈవో గదిలో బీరువాను తెరిచి అందులో ఉంచిన అమ్మవారి కిరీటం, కంఠాభరణాలు, తదితర 411.75 గ్రాముల బంగారు నగలు, 4కిలోల వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. ఆలయంలోని సీసీ కెమెరాల వైర్లను కట్చేసి, వీడియో రికార్డింగ్ నమోదైన కంప్యూటర్ హార్డ్ డిస్క్ను ఎత్తుకెళ్లిపోయారు. ఈ చోరీ కేసు దర్యాప్తు కోసం ఆరు బృందాలను ఏర్పాటుచేసినట్టు ఏసీపీ తెలిపారు.