వక్ఫ్బోర్డ్ సీఈవోకు జైలు, జరిమానా
ABN , First Publish Date - 2021-11-09T07:24:36+05:30 IST
వక్ఫ్బోర్డ్ సీఈవోకు జైలు, జరిమానా
అమరావతి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ స్టేట్ వక్ఫ్బోర్డ్ సీఈవో ఎస్.అలీమ్ భాషాకు హైకోర్టు రెండు వారాల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం తీర్పు ఇచ్చారు. అప్పీల్ దాఖలు చేసుకునేందుకు శిక్ష అమలును 2 వారాలు నిలుపుదల చేశారు. కర్నూలు జిల్లా, ఆలూరు మండలం మొలగవల్లి పరిధిలోని సర్వే నం.662లో 18.79 ఎకరాలను రిజిస్ట్రేషన్ నిషిద్ధ జాబితా 22(ఏ)(1)(సి)లో చేర్చడాన్ని సవాల్ చేస్తూ బి.శివానంద హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు నాలుగు వారాల్లో సంబంధిత సర్వే నంబరును రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని 31 డిసెంబరు 2019న వక్ఫ్బోర్డ్ సీఈవోను ఆదేశించింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంతో పిటిషనర్ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు.