ఇంకా తీరని చిప్ల కొరత
ABN , First Publish Date - 2021-09-01T10:21:56+05:30 IST
సెమీకండక్టర్లుగా పిలిచే సిలికాన్ చిప్ల కొరత ఆటోమొబైల్ పరిశ్రమను ఇంకా వేధిస్తోంది. ఈ ప్రభావం దేశంలోని అతి పెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ)పైనా కనిపిస్తోంది.
ఉత్పత్తిపైనా ప్రభావం..
సెప్టెంబరులో ఉత్పత్తి 40% మించదు : మారుతీ సుజుకీ
న్యూఢిల్లీ : సెమీకండక్టర్లుగా పిలిచే సిలికాన్ చిప్ల కొరత ఆటోమొబైల్ పరిశ్రమను ఇంకా వేధిస్తోంది. ఈ ప్రభావం దేశంలోని అతి పెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ)పైనా కనిపిస్తోంది. చిప్ల కొరతతో సెప్టెంబరు నెలలో హరియాణా, గుజరాత్ల్లోని తమ మూడు ప్లాంట్ల సాధారణ ఉత్పత్తి సామర్ధ్యంలో 40 శాతానికి మించి ఉపయోగించుకునే పరిస్థితి లేదని మారుతీ తెలిపింది.
చిప్ల ప్రాధాన్యత
అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న కార్లలో నియంత్రణ, మెమరీ ఫంక్లన్ల కోసం సిలికాన్ చిప్ప్ ఉపయోగిస్తారు. కంప్యూటర్లు, లాప్టా్పలు, సెల్ఫోన్లలోనూ వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. కొవిడ్ తర్వాత ఈ చిప్స్కు డిమాండ్ విపరీతంగా పెరిగి, తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ కంపెనీలు, డిమాండ్కు తగ్గట్టు తమ ఉత్పత్తి సామర్ద్యం ఉపయోగించుకోలేక పోతున్నాయి.
ధరల పెంపు తప్పదు
ఉత్పత్తి ఖర్చులు పెరిగినందున సెప్టెంబరులో మరోసారి ధరల పెంపు తప్పదని మారుతీ సుజుకీ తెలిపింది. ఈ నెలలోనే ఈ పెంపు ఉంటుందని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు. అన్ని మోడల్స్పైనా ఈ పెంపు ఉంటుందన్నారు. మారుతీ సుజుకీ తన వాహనాల ధరలు పెంచడం ఈ సంవత్సరం ఇది మూడో సారి. కంపెనీ ఇప్పటికే జనవరి, ఏప్రిల్ నెలల్లో రెండు విడతలుగా 3.5 శాతం వరకు ధరలు పెంచింది. అయితే సెప్టెంబరులో ఏ తేదీ నుంచి ధరలు పెంచేది శ్రీవాస్తవ వెల్లడించలేదు. గత ఏడాది కాలంలో స్టీలు, కాపర్ ధరలు రెట్టింపుకుపైగా పెరగడం వల్లే ధరలు పెంచాల్సి వస్తోందన్నారు.
అమ్మకాలపైనా ప్రభావం
చిప్ల కొరత ప్రభావం వాహన కంపెనీల అమ్మకాలపైనా ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. ఆగస్టు-సెప్టెంబరు నెలల అమ్మకాలపై ఈ ప్రభావం స్పష్టంగా ఉంటుందని ‘జెఫ్రీస్’ అనే ఆర్థిక సేవల సంస్థ తన తాజా నివేదికలో అంచనా వేసింది. కొవిడ్ రెండో ఉధృతి నుంచి మార్కెట్ కోలుకుంటున్న సమయంలో, చిప్ల కొరత కంపెనీలకు పెద్ద సమస్యగా మారిందని తెలిపింది. 2019 పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో ద్విచక్ర వాహన రిజిస్ట్రేషన్లు 15 శాతం పడిపోయిన విషయాన్ని గుర్తు చేసింది. మారుతీ, బజాజ్, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.