జాతిని కదిలించిన స్వాతంత్ర్య నినాదాలు

ABN , First Publish Date - 2021-08-15T06:10:45+05:30 IST

భారత స్వాతంత్ర్య అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఉద్యమానికి స్ఫూర్తిని, ప్రేరణను అందించిన శక్తిమంతమైన కొన్ని నినాదాలను గుర్తు చేసుకోవడం మన నైతిక కర్తవ్యం....

జాతిని కదిలించిన స్వాతంత్ర్య నినాదాలు

భారత స్వాతంత్ర్య అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఉద్యమానికి స్ఫూర్తిని, ప్రేరణను అందించిన శక్తిమంతమైన కొన్ని నినాదాలను గుర్తు చేసుకోవడం మన నైతిక కర్తవ్యం. సాధారణంగా రాజులు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు శత్రుసైన్యాన్ని భయపెట్టే ఉద్దేశంతో రకరకాల ధ్వనులు, భీకరమైన శబ్దాలు, రణన్నినాదాలు చేస్తారు. అరుపులు, కేకలు, నినాదాలతో యుద్ధమైదానం మార్మోగిపోతుంది. ఢమరుక, శంఖానాదాలతో తమ సైనికుల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు, శత్రుసైన్యంలో భయోత్పాతాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తారు. నినాదం ఓ ప్రముఖ ఆయుధం. 


స్వాతంత్ర్యోదమ నినాదాల్లో అన్నిటికన్నా ‘క్విట్‌ ఇండియా’ (1942) నినాదం మనందరికీ సుపరిచితం. ఇది భారతీయుల హదయాల్లో ఎంతగా నాటుకుపోయిందో బ్రిటిష్‌ పాలకుల గుండెల్లో కూడా అంతగా గుచ్చుకుపోయి వారిని భయకంపితుల్ని చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశ స్వాతంత్య్రోద్యమాన్నే ఈ నినాదం ఓ మలుపు తిప్పింది. ‘క్విట్ ఇండియా’ నినాద రూపకర్త యూసుఫ్ మెహర్ అలీ. ఉద్యమ సమయంలో ఆయన ముంబై మేయర్‌గా ఉన్నారు. స్వాతంత్య్రోద్యమంలో ఆయన ఎనిమిదిసార్లు జైలుకు వెళ్లారు. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వ్యూహరచన చేస్తున్న మహాత్మాగాంధీ తన సహచరులతో ముంబైలో సమావేశమైనప్పుడు స్వాతంత్య్ర పోరాటానికి ఊపునిచ్చే శక్తివంతమైన నినాదాలను సూచించాలని కోరారు. అప్పుడు ఒకరు ‘గెటవుట్‌’ అనేదాన్ని సూచించారు. అది బాగా లేదని గాంధీజీ తిరస్కరించారు. ‘రిట్రీట్‌ ఆర్‌ విత్‌డ్రా’ అన్న పదాన్ని రాజగోపాలచారి సూచించినా మహాత్ముడికి అదీ నచ్చలేదు. అక్కడే ఉన్న యూసుఫ్‌ మెహర్ అలీ ‘క్విట్‌ ఇండియా’ అనే నినాదాన్ని ప్రతిపాదించారు. గాంధీజీకి అది అమితంగా నచ్చి వెంటనే ఆమోదించారు. క్విట్ ఇండియా ఉద్యమం నుండి వచ్చిందే ‘డూ ఆర్ డై’ అనే నినాదం. జాతీయ సమైక్యత, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాతంత్ర్య పోరాటం సాగుతుండగా గాంధీ‌జీ ఇచ్చిన‌ పిలుపు డూ ఆర్ డై ఉద్యమకారుల్లో ఎంతగానో స్ఫూర్తిని‌ నింపింది.


‘సైమన్ గోబ్యాక్’ అనే నినాదం కూడా యూసుఫ్ మెహర్ అలీదే. బ్రిటిష్‌ ఇండియా పాలనను మెరుగుపర్చేందుకు సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం బ్రిటిష్‌ పాలకులు 1928లో సైమన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. అందులో ఒక్క భారతీయుడికీ స్థానం కల్పించలేదు. అందరూ బ్రిటిష్‌ అధికారులే ఉన్నారు. అందుకు నిరసనగా 1928లో సైమన్‌ కమిషన్‌ సభ్యులు ముంబై రేవులో దిగినప్పుడు యూసుఫ్‌ మెహర్ అలీ కొంత మందితో కలిసి కూలీల వేషంలో రేవుకువెళ్ళి ‘సైమన్ గోబ్యాక్’ అంటూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. 


మరో స్ఫూర్తిదాయక నినాదం ‘ఇంక్విలాబ్ జిందాబాద్’. ఈ నినాదాన్ని ప్రముఖ ఉర్దూకవి, ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా హస్రత్ మోహనీ రూపొందించారు. ఇది భగత్‌సింగ్‌కు అమితంగా నచ్చింది. అత్యంత ప్రభావవంతమైన ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదాన్ని షహీద్ భగత్‌సింగ్ విస్తృతంగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటే విప్లవం వర్ధిల్లాలి అని అర్థం. ఇది స్వాతంత్ర్య పోరాట కాలంలోని రణనినాదాలలో ఒకటిగా మారిపోయింది. భారతీయ యువతలో దేశభక్తి భావనను, స్వాతంత్ర్యేచ్ఛను జాగృతం చేసి సంగ్రామంలో పాల్గొనేవిధంగా ప్రేరేపించింది.


‘సత్యమేవ జయతే’ (ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది) అనే ఉపనిషద్‌వాక్యాన్ని పండిట్ మదన్ మోహన్ మాలవ్యా ప్రస్థావిస్తే, దాన్ని మనం జాతీయనినాదంగా స్వీకరించాం. అది జాతీయ చిహ్నం మీద కూడా ఉంటుంది. 1918లో భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షత వహిస్తూ పండిట్ మదన్ మోహన్ మాలవ్యా ఈ నినాదాన్ని ఉద్ఘోషించారు. 


ఆసేతు హిమాచలం ఆబాలగోపాలానికి తెలిసిన నినాదం ‘జైహింద్’. ఈ నినాద స్రష్ట హైదరాబాద్‌వాసి ఆబిద్ హసన్ సఫ్రానీ. నేతాజీ బోస్ ద్వారా ఈ నినాదం స్వాతంత్ర్య సమరయోధుల అధికారిక నినాదంగా మారిపోయింది. ఇప్పటికీ రాజకీయనాయకులు, దేశభక్తులు తరచూ ఈ నినాదాన్ని ఉపయోగిస్తూఉంటారు. అనుపమానమైన దేశభక్తికి తార్కాణంగా చేసే నినాదంగా నేటికీ ప్రజల హృదయాల్లో ఇది బలంగా ముద్రించుకుపోయింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సుభాస్ చంద్రబోస్ భారతస్వాతంత్య్ర సమరానికి మద్దతు కూడగట్టేందుకు జర్మనీ వెళ్లారు. ఆ సమయంలో జర్మనీ బ్రిటన్‌తో యుద్ధం చేస్తోంది. అదే సమయంలో అబిద్ తన ఇంజనీరింగ్ చదువు నిమిత్తం జర్మనీ వెళ్ళారు. బోస్ ప్రసంగాలకు ప్రభావితమైన అబిద్ హసన్ తన ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే విడిచిపెట్టి, ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా చేరారు. ఇండియన్ నేషనల్ ఆర్మీలో భిన్నవర్గాలకు చెందిన ప్రజలు ఉండేవారు. అందులో కొంతమంది ‘నమస్కార్’ అని సంబోధిస్తే, మరికొంతమంది ‘రామ్ రామ్’ అంటూ పలకరించుకునేవారు. ‘సత్ శ్రీ అకాల్’, ‘అస్సలామలైకుం’ అంటూ అభివాదం చేసుకునేవారు కూడా ఉండేవారు.


సెక్యులర్ భావాలు కలిగిన బోస్‌కు ఇన్ని రకాల అభివాదాలు ఉండటం సబబుగా అనిపించలేదు. అందరికీ ఆమోద యోగ్యమైన ఓ అభివాద నినాదాన్ని రూపొందించాలని తన సన్నిహితులకు చెప్పారు. అబిద్ ముందుగా ‘హలో’ అని ప్రతిపాదించారు కాని బోస్‌కు అది నచ్చలేదు. తర్వాత ‘జై హిందుస్తాన్’, ‘జై హింద్’ అనే నినాదాలను సూచించారు. జైహిందుస్తాన్ కాస్త పెద్దదిగా ఉండడంతో బోస్ ‘జై హింద్’ కే జై కొట్టారు. ఈ నినాదాన్ని ఆయన విశేషంగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి ‘జై హింద్’ అనే పదం దేశభక్తిని చాటుకునే ఒక నినాదంగా మారిపోయింది. నేతాజీ యే ‘మీరు నాకు రక్తాన్నివ్వండి నేను‌ మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను’ అని నినదించారు. భారత జాతీయ సైన్యంలో చేరాలని భారత యువతను కోరుతూ నేతాజీ దీన్ని ప్రయోగించారు. మాతృభూమి కోసం తమ జీవితాలను త్యాగం చేయడానికి వేలాది యువహృదయాలను ఈ నినాదం ప్రేరేపించింది. అశేష యువతీ యువకులకు ఇదొక ఒక రణ నినాదమై వారిని స్వాతంత్రోద్యమం వైపు పరుగులు తీయించింది.


‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అనేది మరో చైతన్యశీల నినాదం. కాకా బాప్టిస్టా పలికిన ఈ నినాదాన్ని లోక్‌మాన్య బాలగంగాధర్ తిలక్ స్వీకరించారు, దేశప్రేమికుల గుండెల్లో స్వాతంత్ర్య జ్వాలలు రేకెత్తించారు. ఈ నినాదం దేశ ప్రజలను స్వేచ్ఛా, స్వాతంత్ర్యం కోసం పోరాడటానికి ప్రేరేపించడమే కాక, వేలాది ప్రజల హృదయాల్లో దేశంపై ప్రేమను ఉరకలెత్తించింది. ఇవేకాకుండా ఇంకా‌ ఇలాంటి అనేక నినాదాలు స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రధానపాత్రే పోషించాయి. మన స్వాతంత్ర్యసమరయోధులు చేసిన‌‌ ఈ నినాదాలు వలస పాలకుల హృదయాల్లో భీతిని కలిగించి మాతృభూమిని పరాయి బానిసత్వం నుంచి విముక్తి చేశాయి.

యండి. ఉస్మాన్ ఖాన్

Updated Date - 2021-08-15T06:10:45+05:30 IST