ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. జగన్ మాటలకు మోసపోకండి
ABN , First Publish Date - 2021-12-28T20:08:25+05:30 IST
సీఎం జగన్ మాయ మాటలకు మోసపోవద్దని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సూచించారు.
అచ్చెన్నాయుడు సూచన
విశాఖపట్నం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్ మాయ మాటలకు మోసపోవద్దని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సూచించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం కేలండర్, డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా సీపీఎస్ రద్దు చేయలేదు సరికదా పీఆర్సీ అమలు, ఏడు డీఏలు పెండింగ్లో పెట్టారని ఆరోపించారు. ఉద్యోగుల సమస్యలు చర్చించడానికి ఎప్పటికప్పుడు సంఘాల నేతలతో సమావేశం కావల్సిన సీఎం, వారి ముఖాలు చూడడానికి ఇష్టపడడం లేదంటే... ఆయన నైజం ఏమిటో ఇప్పటికైనా తెలుసుకోవాలన్నారు. కార్యక్రమానికి తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం వర్కింగ్ అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి అధ్యక్షత వహించారు.