షారుక్ థ్రిల్లింగ్ సిక్స్
ABN , First Publish Date - 2021-11-23T09:07:28+05:30 IST
షారుక్ థ్రిల్లింగ్ సిక్స్
‘ముస్తాక్ అలీ’ విజేత తమిళనాడు
4 వికెట్లతో ఓడిన కర్ణాటక
న్యూఢిల్లీ: విజయం కోసం చివరి బంతికి ఐదు పరుగులు కావాల్సి ఉండగా.. తీవ్ర ఒత్తిడి మధ్య హిట్టర్ షారుక్ ఖాన్ (15 బంతుల్లో 33 నాటౌట్) సిక్స్ బాదడంతో తమిళనాడు వరుసగా రెండోసారి ముస్తాక్ అలీ ట్రోఫీని ఎగరేసుకు పోయింది. సోమవారం జరిగిన థ్రిల్లింగ్ ఫైనల్లో డిఫెండింగ్ చాంప్ తమిళనాడు నాలుగు వికెట్ల తేడాతో కర్ణాటకను ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అభినవ్ మనోహర్ (46), ప్రవీణ్ దూబె (33) టాప్ స్కోరర్లు. స్పిన్నర్ సాయి కిషోర్ (3/12) రాణించాడు. అనంతరం ఛేదనలో తమిళనాడు ఓవర్లన్నీ ఆడి 153/6 స్కోరు చేసి గెలిచింది. ఓపెనర్ హరి నిశాంత్ (23) ధాటిగా ఆడినా.. రనౌట్ కావడం జట్టుపై ప్రభావం చూపింది. క్రీజులో ఉన్నంతసేపు ఇబ్బందిపడిన మరో ఓపెనర్ నారాయణ్ జగదీశన్ (41), కెప్టెన్ విజయ్ శంకర్ (18)ను కరియప్ప అవుట్ చేసి దెబ్బకొట్టాడు. 95/4తో ఓటమి తప్పదేమో అనే స్థితిలో క్రీజులోకి వచ్చిన షారుక్ సందర్భోచితంగా బ్యాట్ను ఝుళిపించాడు. ఆఖరి ఓవర్లో విజయానికి 16 పరుగులు అవసరం కాగా.. తొలి 5 బంతుల్లో 11 పరుగులు లభించాయి. చివరి బంతికి ఐదు పరుగులు అవసరం కాగా.. షారుక్ సంచలన సిక్స్తో మ్యాచ్ను ఫినిష్ చేశాడు.