18 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ
ABN , First Publish Date - 2021-11-23T09:23:40+05:30 IST
రాష్ట్రంలో సుమారు 18 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయా..? అవునంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.
- పాఠశాల విద్య కేడర్ పోస్టుల విభజన ప్రక్రియ పూర్తి
- మరో రెండు రోజుల్లో ప్రభుత్వానికి సమర్పణ
హైదరాబాద్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సుమారు 18 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయా..? అవునంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేడర్ పోస్టులను ప్రభుత్వం విభజిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా పాఠశాల విద్య శాఖ విభజన ప్రక్రియ దాదాపు చివరి దశకు చేరుకుంది. అధికారులు రెండు రోజుల్లో జిల్లాల వారీ కేడర్ పోస్టుల విభజన జాబితాలను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. విద్యా శాఖ అధికారులు డీఈవోల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. సోమవారం కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరాలను సేకరించారు. వాటిప్రకారం రాష్ట్రంలో మొత్తం 1.20 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. 1.02 లక్షల మంది విధుల్లో ఉన్నారు. ఇక కేడర్ విభజనలో ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్స్, పీఈటీలను జిల్లా స్థాయి క్యాడర్గా నిర్ణయించారు. ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్ల వంటి పోస్టులను జోనల్, మల్టీ జోన్ల పరిధిలోకి తీసుకురానున్నారు. రాష్ట్ర స్థాయి కార్యాలయాలైన పాఠశాల విద్య కమిషనరేట్, ఎస్సీఈఆర్టీ వంటి వాటిల్లో పనిచేస్తున్న సిబ్బంది, ఇతర అధికారుల పోస్టులను రాష్ట్ర స్థాయివిగా గుర్తించారు.