రెండు ఆర్టీసీ బస్సులు ఢీ
ABN , First Publish Date - 2021-01-14T04:36:55+05:30 IST
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ
20 మందికి గాయాలు
ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి విషమం
ఎల్కతుర్తి, జనవరి 13: ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామ శివారులోని ఎస్ఆర్ఆర్ ఫార్మసీ కళాశాల సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం ఉదయం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. దీంతో ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలు కాగా, కండక్టర్లతో కలిపి 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. విషయం తెలసుకున్న ఎల్కతుర్తి సీఐ శ్రీనివా్సజీ, ఎస్ఐ గడ్డం ఉమ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారిపై గంటల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వరంగల్- 1 డిపోకు చెందిన టీఎ్స03యూబీ 1044 నంబరు గల బస్సు వరంగల్ నుంచి 50 మంది ప్రయాణికులతో నిజామాబాద్కు బయలుదేరింది. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం కౌకొండ గ్రామానికి చెందిన చుక్క రాజేష్ ఈ బస్సుకు డ్రైవర్గా ఉన్నాడు. అలాగే కరీంనగర్ - 1 డిపోకు చెందిన టీఎస్ 02యూసీ 6009 నంబరు గల బస్సు కరీంనగర్ నుంచి వరంగల్కు 48 మంది ప్రయాణికులతో బయలుదేరింది. కరీంనగర్ జిల్లా గన్నేవరం మండలం పరువెల్ల గ్రామానికి చెందిన లింగంపల్లి ప్రశాంత్ డ్రైవర్గా ఉన్నాడు.
మార్గమధ్యలో వల్భాపూర్ గ్రామ శివారులో ఎస్ఆర్ఆర్ ఫార్మసీ కళాశాల సమీపంలో మలుపు వద్ద వరంగల్ డిపో బస్సు.. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న కరీంనగర్ డిపో బస్సును వేగంగా ఢీ కొట్టింది. దీంతో రెండు బస్సుల్లోని డ్రైవర్లకు తీవ్ర గాయాలై వారి సీట్లల్లోనే చిక్కుకుపోయారు. వరంగల్-1 డిపో కండక్టర్ హన్మకొండకు చెందిన కొండూరు నర్సిహారెడ్డి, కరీంగనర్ -1 డిపో కండక్టర్ కరీంనగర్లోని లక్ష్మినగర్కు చెందిన బూట్ల సత్తయ్యలతో పాటు 20మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. పోలీసులు, గ్రామస్థులు క్షతగాత్రులను బస్సుల్లో నుంచి కిందకు దింపారు. తీవ్రంగా గాయపడినవారిని 108 అంబులెన్స్ల ద్వారా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. స్వల్పంగా గాయాలైన వారిని హుజురాబాద్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్ డిపో కండక్టర్ బూట్ల సత్యయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివా్సజీ తెలిపారు.
ఆర్టీసీ అధికారుల విచారణ
హన్మకొండ అర్బన్, జనవరి 13: ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటపై ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టారు. కరీనంగర్-1డిపో బస్సు డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినట్లు కొందరు ప్రయాణికులు తెలిపారు. బస్సు ప్రమాదంలో గాయపడిన 22 మందికి ప్రయాణికుల్లో ప్రస్తుతం 13మంది ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు డ్రైవర్లు సీహెచ్ రాజేష్, ఎల్.ప్రశాంత్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రులకు ఆర్టీసీ ఆర్ఎం కృష్ణమూర్తి, డీఎం సురే్షలు రూ.33,500 ఆర్థిక సాయం అందజేశారు.