కిరాయిదారు కిరికిరి
ABN , First Publish Date - 2021-02-08T05:41:55+05:30 IST
కిరాయిదారు కిరికిరి
యజమాని భౌతికకాయాన్ని తన షాపు ఎదుట పెట్టొద్దంటూ వాగ్వాదం
డోర్నకల్, ఫిబ్రవరి 7 : ఓ ఇంటి యజమాని అనారోగ్యంతో మృతిచెందగా ఆ భౌతికకాయాన్ని బంధువుల సందర్శనార్థం ఆయన అద్దెకు ఇచ్చిన దుకాణం ఎదుట ఉంచడంతో షాపు నిర్వాహకుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో డోర్నకల్లో ఆదివారం కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. మండలకేంద్రానికి చెందిన ఉత్తమ్చంద్ శర్మ తన ఇంటిలోని రెండు గదులను కొన్నేళ్ల కిందట ఓ రెడీమేడ్ షాపు నిర్వాహకుడికి అద్దెకు ఇచ్చాడు. కొంతకాలంగా ఉత్మమ్ శర్మకు షాపు నిర్వాహకుడికి అద్దె విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో అనారోగ్యంతో ఉత్తమ్ చంద్ శనివారం రాత్రి మృతి చెందాడు. ఆయన పార్థీవ దేహాన్ని ఇంటికి తీసుకురాగా, కుటుంబసభ్యులు షాపు ఎదుట ఉంచారు. దీంతో దుకాణం నిర్వాహకుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో కుటుంబసభ్యులు, దుకాణ యజమాని మధ్య వాగ్వాదం నెలకొంది. మునిసిపల్ చైర్మన్ వీరన్న, వ్యాపార ప్రముకులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలకు సర్ధి చెప్పారు. షాపు నిర్వాహకుడితో ఓ గదిని ఖాళీ చేయించడంతో గొడవ సద్దుమణిగింది. ఎస్సై భద్రునాయక్ సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.