‘డబుల్’ ఇళ్ల కోసం గుడిసెవాసుల ధర్నా
ABN , First Publish Date - 2021-01-07T04:00:57+05:30 IST
‘డబుల్’ ఇళ్ల కోసం గుడిసెవాసుల ధర్నా

జనగామ టౌన్, జనవరి 6: జనగామ పట్టణంలోని బాణాపురం ప్రాంతంలో పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇళ్లను వెంటనే ప్రారంభించాలని కోరుతూ ఏసిరెడ్డినగర్ గుడిసెవాసులు బుధవారం కలెక్టర్ క్యాంపు ఆఫీస్ సమీపంలో ధర్నా చేశారు. సీఐటీయూ గుడిసెవాసుల సంఘం ఆధ్వర్యంలో చౌరస్తా నుంచి కలెక్టర్ క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీగా తరలివెళ్లి క్యాంపు ఆఫీసు ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో బయట రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించారు. నూతన కలెక్టరేట్ నిర్మాణం కోసం ఏసిరెడ్డినగర్ ప్రాంతం ఖాళీ చేసి ఇండ్ల స్థలాలు అప్పగించినా ఇంత వరకు డబుల్బెడ్రూంలు అందించడం లేదన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, నాయకులు బూడిద గోపి, జోగు ప్రకాశ్, బొట్ల శేఖర్, గుడిసెవాసుల ఆందోళనకు మద్దతు పలికారు.