రహదారుల నిర్మాణం పూర్తిచేయాలి
ABN , First Publish Date - 2021-09-03T05:15:55+05:30 IST
మండలంలో అసంపూర్తిగా మిగిలిన రహదారుల నిర్మాణాలను వెంటనే పూర్తిచేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
అధికారులకు భట్టి ఆదేశం
పండ్రేగుపల్లి, మల్లారం రోడ్డు పరిశీలన
ముదిగొండ, సెప్టెంబరు 2: మండలంలో అసంపూర్తిగా మిగిలిన రహదారుల నిర్మాణాలను వెంటనే పూర్తిచేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన మండలంలోని పండ్రేగుపల్లి నుంచి మల్లారం వరకు గతంలో మంజూరైన రహదారి పనులు నిల్చిపోవడంతో వాటిని ఆయన పరిశీలించారు. ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. రహదారి నిర్మాణాన్ని వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రహదారుల పరిశీలనలో భాగంగా పొలాల వద్ద రైతులతో ముచ్చటించారు. గతంలో ఈ రహదారి ఎలా ఉండేది ఇప్పుడెలా ఉందని మహిళా రైతును భట్టి విక్రమార్క ప్రశ్నించటంతో అప్పుడు డొంక దారిగా ఉండేది ఇప్పుడు మీరు రహదారి మంజూరు చేయటం వల్ల పొలానికి బండ్లపై వస్తున్నాము. భూముల రేట్లు ఎలా ఉన్నాయి అని రైతులను అడిగి తెలుసుకున్నారు. గతంలో కంటే రోడ్డు మంజూరైన తర్వాత ఇప్పుడు మూడువంతుల భూముల ధరలు పెరిగాయని, మీరు నిధులు మంజూరు చేసి ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం వల్లనే భూముల రేట్లు పెరిగాయని రైతులు సమాధానమిచ్చారు. పండ్రేగుపల్లి నుంచి వల్లాపురం వరకు రహదారి పరిస్థితి ఎలా ఉందని పర్యటించి పరిశీలించారు. ఈ రహదారి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయించాలని రైతులు కోరారు. ఖానాపురం సర్పంచ్ మాలోజు ఉష గ్రామసమస్యలతోపాటు తాము గ్రామంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలు పరిష్కరిస్తానని ఉషకు భట్టి హామీ ఇచ్చారు. కమలాపురంలో ఇటీవల మృతిచెందిన పలుకుటుంబాలను ఆయన పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ బులెట్బాబు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొమ్మినేని రమే్షబాబు, మాజీ సర్పంచ్ అజ్గర్, మల్లెల అజయ్, ఐనాల నర్సింహారావు, బొందయ్య, గోవిందు, అంజయ్య, రవీందర్రెడ్డి పాల్గొన్నారు.