ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,921 కేసుల పరిష్కారం
ABN , First Publish Date - 2021-07-11T04:29:08+05:30 IST
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,921 కేసుల పరిష్కారం
చొరవ చూపిన అందరికీ కృతజ్ఞతలు : జిల్లా జడ్జి నర్సింగరావు
వరంగల్ లీగల్, జూలై 10: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశానుసారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,921 కేసులు పరిష్కరించినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి నందికొండ నర్సింగరావు తెలిపారు. శనివారం ఉదయం న్యాయసేవా సదన్ భవన్లో జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించి మాట్లాడారు. రాజీమార్గమే రాజ మార్గమని, కక్షిదారులు పట్టింపులకు పోకుం డా రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు.
కాగా, లోక్ అదాలత్లో పెండింగ్ కేసులు, ప్రీలిటిగేషన్ కేసులు పరిష్కరించేందుకు వరంగల్ జిల్లా కేంద్రంలో 12 బెంచీలను, మహబూబాబాద్ 3, జనగామ 4, ములుగు 2, తొర్రూరు 1, నర్సంపేట 1, పరకాల 2 మొ త్తంగా 25 బెంచీలను ఏర్పాటు చేసి అత్యధిక కేసులు పరిష్కరించినట్లు న్యాయసేవా సంస్థ కార్యదర్శి జి.వి.మహేశ్నాథ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రీలిటిగేషన్ బ్యాంకు కేసులు 389 కేసులు పరిష్కరించి రూ.1,60,74,957 వసూ లు చేసినట్లు తెలిపారు. అలాగే పెండింగ్లో ఉన్న సివిల్ కేసులు 137, క్రిమినల్ కేసులు 3307 పరిష్కరించారు. మోటార్ ప్రమాద బీమా కేసులు 88 పరిష్కరించి బాధితులకు రూ.2,85,65800 నష్టపరిహారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు కె.జయకుమార్, కె.శైలజ, కె.ప్రభాకర్రావు, సీనియర్ సివిల్ జడ్జిలు డివి.నాగేశ్వర్రావు, ఇతరన్యాయమూర్తులు, కమిషనర్ ఆఫ్ పోలీస్ తరుణ్జోషి, అర్బన్జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, అడిషినల్ డీసీపీ కె.పుష్ప, బార్ కౌన్సిల్ సభ్యులు దుస్సా జనార్దన్, సిరికొండ సంజీవరావు, జిల్లాబార్ అసో సియేషన్ అధ్యక్షుడు కెపి.ఈశ్వర్నాథ్, లోక్ అదాలత్ బెంచ్ సభ్యులు, వివిధ బ్యాంకు, ఇన్సూరెన్స్ అధికారులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కోర్టు ప్రాంగణంలో హరితహారంలోభాగంగా జిల్లా జడ్జితో పాటు ఇతర న్యాయమూర్తులు, సీపీ, కలెక్టర్ తదితరులు మొక్కలు నాటారు.