ప్రభుత్వ పరిశీలనలో అర్హులైన 57 ఏండ్ల వాళ్ళందరికీ పెన్షన్లు
ABN , First Publish Date - 2021-03-22T21:44:16+05:30 IST
57 ఏండ్లు నిండిన అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. అ
హైదరాబాద్: 57 ఏండ్లు నిండిన అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాలలో గౌరవ శాసన సభ్యులు పద్మాదేవేందర్ రెడ్డి, అరూరి రమేశ్, బొల్లం మల్లయ్య యాదవ్ తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సవివరంగా సమాధానమిచ్చారు.కరోనా కారణంగా కొంత ఆలస్యమైనప్పటికీ, సీఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్ళామని, 57 ఏండ్లు నిండిన అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నదని అన్నారు. అయితే, కరోనా కష్ట కాలంలోనూ పెన్షన్లను ఏమాత్రం ఆపకుండా ఇస్తున్న ఘనత సీఎం కెసిఆర్ దే అన్నారు.
రాష్ట్రంలో 39లక్షల 36వేల 521 మందికి పెన్షన్లు ఇస్తున్నామన్నారు. 13,19,300 మంది వృద్ధులకు, 14,43,648 మంది వితంతువులకు, 4,89,648 మంది వికలాంగులకు, 37,342మంది చేనేతలకు, 62,942 మంది కల్లుగీత కార్మికులకు, 28,582 మంది ఎయిడ్స్, 14,140 మంది బోదకాలు బాధితులకు, 4,08,621 మంది బీడీ కార్మికులకు, 1,32,298 మంది ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ఆసరా పెన్షన్ల కింద ప్రతి ఏడాది 11,724కోట్ల 70లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు కూడా మంత్రి ఎర్రబెల్లి వివరించారు.