పోడు భూములకు పరిష్కారం
ABN , First Publish Date - 2021-08-10T07:16:24+05:30 IST
ప్రకృతిలో భాగమై నివసించే ఆదివాసీలు అత్యంత స్వచ్ఛమైన మనుషులని, మానవ సమాజంలో ఇంకా తరిగిపోని మమతానురాగాలకు, కల్మశంలేని మానవీయ సంబంధాలకు ప్రతీకలని సీఎం కేసీఆర్ కొనియాడారు. స్వయం పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
త్వరలో అటవీ భూముల సర్వేను చేపడతాం..
ఆదివాసీ గూడేల్లో మౌలిక వసతులను కల్పించాం
విషజ్వరాలతో చనిపోయే పరిస్థితిని నివారించాం
గురుకులాల్లో అంతర్జాతీయ స్థాయి విద్యనందిస్తున్నాం: సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ప్రకృతిలో భాగమై నివసించే ఆదివాసీలు అత్యంత స్వచ్ఛమైన మనుషులని, మానవ సమాజంలో ఇంకా తరిగిపోని మమతానురాగాలకు, కల్మశంలేని మానవీయ సంబంధాలకు ప్రతీకలని సీఎం కేసీఆర్ కొనియాడారు. స్వయం పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. అటవీ భూముల సర్వేను చేపట్టడంతో పాటు.. త్వరలోనే పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించనున్నామని చెప్పారు. పోడు భూములకు కూడా రైతుబంధును అందిస్తున్నామన్నారు. సోమవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదివాసీలకు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన గూడేల్లో విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక వసతుల కోసం ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఆదివాసీల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేకమైన వైద్య సౌకర్యాలను కల్పించిదన్నారు. గతంలో మాదిరిగా విష జ్వరాలతో ఆదివాసీలు మరణించే పరిస్థితిని నివారించిందన్నారు.
గిరిజన గూడేలను, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని, ఎస్టీ సబ్ ప్లాన్ను పటిష్టంగా అమలు చేస్తున్నామని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా అత్యంత సుదూరంలోని గోండు గూడేలకు సైతం స్వచ్ఛమైన తాగునీటిని అందించామన్నారు. ఎస్టీ గురుకులాలను ఏర్పాటు చేసి, ఆదివాసీ విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఆదివాసీ సంస్కృతిని ప్రపంచానికి చాటేలా హైదరాబాద్లో కుమ్రం భీం భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. ఆదివాసీల దేవతలైన సమ్మక్క-సారలమ్మ, నాగోబా, సేవాలాల్ మహరాజ్ జాతరలను ఘనంగా నిర్వహిస్తున్నామని, వీటికి జాతీయ స్థాయిలో ప్రచారం కల్పిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.
త్వరలో ఇంగ్లిష్ మీడియంలోకి ఆశ్రమ పాఠశాలలు: సత్యవతి
ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివాసీ బిడ్డల చదువుపైనా ప్రత్యేకంగా దృష్టిసారించామన్నారు. తెలుగు మీడియంలో కొనసాగుతున్న ఆశ్రమ పాఠశాలల్ని త్వరలోనే ఇంగ్లిష్ మీడియంలోకి మారుస్తామని చెప్పారు. సోమవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆదివాసీల అభ్యున్నతి కోసం పనిచేసిన వారిని సన్మానించారు. 10 మంది గిరిజన పారిశ్రామిక వేత్తలకు సీఎం ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్ షిప్ పథకం కింద రూ. 4.4 కోట్ల చెక్కులు అందించారు.
అటవీ నుంచి నాణ్యమైన తేనె సేకరించే వారికి రూ. 90 లక్షల విలువైన తేనె సేకరణ ఉపకరణాలు అందించారు. గురుకులాల్లో చదువుతూ దేశంలోని ప్రముఖ ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించిన 10 మంది ఆదివాసీ విద్యార్థులకు ల్యాప్ టాప్లు అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జాఫర్ హుేస్సన్ మీరాజ్, హరిప్రియా నాయక్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, పద్మశ్రీ గుస్సాడి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.