‘ధాన్యం కొనుగోలు’పై కొనసాగిన టీఆర్ఎస్ ఆందోళనలు
ABN , First Publish Date - 2021-12-07T08:01:51+05:30 IST
పార్లమెంటు ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీల నిరసనలు కొనసాగాయి. ధాన్యం కొనుగోలు అంశంపై సోమవా రం కూడా ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ,
- పార్లమెంటులో నిరసనలు.. ఎంపీల వాకౌట్
న్యూఢిల్లీ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీల నిరసనలు కొనసాగాయి. ధాన్యం కొనుగోలు అంశంపై సోమవా రం కూడా ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. అనంతరం ఉభయసభల నుంచి వాకౌట్ చేశారు. ధాన్యం కొనుగోలుపై లోక్సభలో నామా నాగేశ్వరరావు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. రాజ్యసభలో 176వ నిబంధన కింద స్వల్పకాలిక చర్చకు కె.కేశవరావు ఇచ్చిన నోటీసును చైర్మన్ వెంకయ్య నాయుడు తిరస్కరించారు. కేంద్రం వైఖరి పట్ల గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు నిరసన చేపట్టారు.
పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు: నామా
పార్లమెంటు సాక్షిగా బీజేపీ ఎంపీలు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు ఆరోపించారు. ధాన్యం కొనుగోలు, బియ్యం స్మగ్లింగ్పై దర్యాప్తు జరిపించాలని బీజేపీ ఎంపీ అర్వింద్ లోక్సభలో చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ సోమవారం నామా ఓ ప్రకటన విడుదల చేశారు. పార్లమెంటును తప్పదోవ పట్టించేలా అర్వింద్ మాట్లాడారన్నారు.