కొలబద్ద.. కొత్త స్థానికతే
ABN , First Publish Date - 2021-12-25T07:32:53+05:30 IST
జిల్లా కేడర్ ఉద్యోగులకు కొత్త ‘స్థానికత’ ఆధారంగా బదిలీలు
లోకల్ కేడర్ బదిలీలు, పోస్టింగులకు మార్గదర్శకాల జారీ
దాని ఆధారంగానే లోకల్ క్యాడర్ బదిలీలు, పోస్టింగులు- మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర సర్కారు
- ఉద్యోగుల నుంచి ఆప్షన్లు.. కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్..
- కలెక్టర్లలతో కమిటీలు.. వారంలో ప్రక్రియ పూర్తి
- ఆర్డర్ పొందిన 3రోజుల్లోగా విఽధుల్లో ఉద్యోగులు..
- రేపటి నుంచి జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగులకు ఆర్డర్లు!
హైదరాబాద్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేడర్ ఉద్యోగులకు కొత్త ‘స్థానికత’ ఆధారంగా బదిలీలు చేపట్టి, పోస్టింగులు ఇవ్వనున్నారు. ఇప్పటికే విభజన ప్రక్రియ పూర్తి చేసుకుని, కేటాయించిన జిల్లాల్లో రిపోర్టు చేసిన జిల్లా కేడర్ ఉద్యోగులకు ఈ పోస్టింగులు ఇస్తారు. అక్కడ ఉద్యోగుల సీనియారిటీ, ఖాళీల ఆధారంగా పోస్టింగులు ఉండనున్నాయి. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించి, కౌన్సెలింగ్ ద్వారా ఈ ప్రక్రియను చేపడతారు. ఇందుకోసం ప్రభుత్వం, జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ బదిలీలు, పోస్టింగులకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తాజాగా మార్గదర్శకాలను జారీ చేశారు.
ఈ మేరకు వారం రోజుల్లోగా ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. పోస్టింగ్ ఆర్డర్ అందుకున్న మూడు రోజుల్లోగా ఉద్యోగులు కొత్త విధుల్లో చేరాల్సి ఉంటుంది. సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలిస్తూ ఈ బదిలీలు, పోస్టింగ్లకు అవకాశం కల్పించారు. ఇప్పటికే తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో లోకల్ కేడర్ ఉద్యోగుల విభజన పూర్తయింది. వీరందరూ తమకు కేటాయించిన జిల్లాల్లో రిపోర్టు చేశారు. ఇప్పుడు కేటాయించిన జిల్లాలో వారు స్థానిక ఉద్యోగులవుతారు. ఆ జిల్లాల్లోని కొత్తగా సీనియారిటీ జాబితాలను రూపొందిస్తారు. ఆ మేరకే బదిలీలు, పోస్టింగులు చేపడతారు.
ఆ శాఖలకు ‘వెసులుబాటు’
పోలీసు, రెవెన్యూ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ఉద్యోగుల పోస్టింగుల కోసం తమ ఆపరేషనల్ ఎఫిషియన్సీ దృష్ట్యా అవసరమైతే ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసుకోవచ్చునని ఆ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. లోకల్ కేడర్లో ఉండే ఈ శాఖల ఉద్యోగుల సంఖ్యలో సమతుల్యం పాటించాల్సి ఉంటుంది. అందుకే వీరికి ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం ఒక జిల్లాలో పని చేస్తున్న ఉద్యోగులను విభజన సందర్భంగా మళ్లీ అదే జిల్లాకు కేటాయించినట్లయితే అలాంటి ఉద్యోగులకు అక్కడే పోస్టింగ్ ఇచ్చినట్లు
జిల్లా కేడర్ పోస్టింగ్లకు మార్గదర్శకాలు
ప్రస్తుతం ఒక జిల్లాలో పని చేస్తున్న ఉద్యోగులను విభజన సందర్భంగా మళ్లీ అదే జిల్లాకు కేటాయించినట్లయితే వారికి అక్కడే పోస్టింగ్ ఇచ్చినట్లు భావించాలి. మళ్లీ ఫ్రెష్ పోస్టింగ్ అనేది ఉండదు.
ప్రస్తుతం పని చేస్తున్న జిల్లాలకు కేటాయించని ఉద్యోగులకు ఫ్రెష్గా కొత్త చోట పోస్టింగులు ఇవ్వాలి. ఉదాహరణకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ ఉద్యోగి నిర్మల్ జిల్లాలో పని చేస్తున్నప్పటికీ విభజన ప్రక్రియలో భాగంగా మంచిర్యాల జిల్లాకు కేటాయిస్తే ఆ ఉద్యోగి మంచిర్యాల జిల్లాలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఆ ఉద్యోగికి ఆ జిల్లాలోనే పోస్టింగ్ ఇవ్వాలి.
పోస్టింగుల కోసం కొత్తగా కేటాయించిన ‘జిల్లా స్థానికత’ ఆధారంగా ఉద్యోగుల సీనియారిటీ జాబితాలను రూపొందించాలి. వీటిని సంబంధిత కలెక్టర్లు ఆమోదించాలి.
పరిపాలనా సౌలభ్యం, విధుల దృష్ట్యా ప్రతి కేటగిరీలో లోకల్ కేడర్ పోస్టుల ఖాళీలను గుర్తించాలి.
కేటాయింపు పోస్టుల జాబితాలను తయారు చేసేటప్పుడు పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా కార్యాలయాల్లో కనీస సంఖ్యలో ఉద్యోగులు ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు ఒక శాఖలోని లోకల్ కేడర్లో 50జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే కేటాయింపుల ద్వారా వచ్చిన జూనియర్ అసిస్టెంట్లు 40మంది మాత్రమే ఉన్నట్లయితే ఈ 40 మందిని ప్రాధాన్యం ప్రకారం ఖాళీల్లో భర్తీ చేయాలి.
పోస్టింగులు ఇచ్చే ముందు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించి, కౌన్సెలింగ్ నిర్వహించాలి. ప్రతి ఉద్యోగి ఆప్షన్ ఇచ్చుకోవాలి. ఒకవేళ ఆప్షన్ ఇవ్వకపోతే మార్గదర్శకాల ప్రకారం సంబంధిత జిల్లా అథారిటీ పోస్టింగులు ఇచ్చేస్తుంది.
పోస్టింగులు, బదిలీలు పారదర్శకంగా జరగాలి. గుర్తింపు సంఘాల ప్రతినిధులను ఆహ్వానించాలి.
దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తీసుకుంటున్నవారిని స్పెషల్ కేసుల కింద పరిగణించి పోస్టింగుల సందర్భంలో ప్రాధాన్యమివ్వాలి. భార్యాభర్తల(స్పౌజ్) కేసులను పరిగణలోకి తీసుకోవాలి.
మొత్తం పోస్టింగులు, విభజన ప్రక్రియ ఏడు రోజుల్లోగా పూర్తి కావాలి. పోస్టింగ్ ఆర్డర్ అందుకున్న మూడు రోజుల్లోగా ఉద్యోగులు తమకు కేటాయించిన స్థానాల్లో విధుల్లో చేరాలి. ఈ పోస్టింగులు, బదిలీల ప్రక్రియను సంబంధిత శాఖల ముఖ్యకార్యదర్శులు/ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సాంతం పరిశీలించాలి. అనంతరం సాధారణ పరిపాలనా శాఖకు పోస్టింగుల నివేదికను సమర్పించాలి.
మిగిలింది ఆరోగ్యం, రెవెన్యూ శాఖలే
వైద్య ఆరోగ్యం, రెవెన్యూ మినహా దాదాపు అన్ని శాఖల ఉద్యోగుల విభజన ముగింపు దశకు చేరింది. మొత్తం 99 విభాగాధిపతుల(హెచ్వోడీ) పరిధిలోని జోనల్, మల్టీ జోనల్ పోస్టులను విభజించి, కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. గురువారం వైద్య ఆరోగ్యం, సమాచార-పౌర సంబంధాలు, పశుసంవర్థక, సహకారం, ఆయుష్ తదితర హెచ్వోడీల పరిధిలోని ఉద్యోగుల విభజనను చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖలో మాత్రం విభజన ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పటికే ఈ శాఖలోని 22 కేటగిరీల ఉద్యోగుల విభజనను పూర్తి చేశారు. మిగిలిన రెండు మూడు కేటగిరీల వారిని శని, ఆదివారాల్లో విభజించనున్నారు.
రెవెన్యూ శాఖ కూడా పెద్దది కావడం, ఎక్కువ కేటగిరీలు ఉండటంతో విభజన కొలిక్కి రాలేదు. దీనిని కూడా రెండు రోజుల్లో పూర్తి చేయనున్నారు. కాగా... ఈ విభజన ప్రక్రియ ఆదివారం నాటికల్లా కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. అదే రోజు నుంచి ఉద్యోగులకు ఆర్డర్లను ఫోన్ మెసేజ్ల రూపంలో జారీ చేయనున్నారు. వాస్తవానికి గురువారం నుంచే మెసేజ్లను పంపించాలని ఉన్నతాధికారులు యోచించినా.. ‘ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం(ఐఎ్ఫఎంఐఎస్)’ లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆదివారం సాయంత్రం నుంచి మెసేజ్లు పంపే అవకాశమున్నట్లు తెలిసింది. ఆ రోజు సాధ్యం కాకపోతే సోమవారం ఉదయం నుంచి పంపిస్తారని ఓ అధికారి తెలిపారు. మెసేజ్లు అందుకున్న మూడు రోజుల్లోగా ఉద్యోగులు తమకు కేటాయించిన చోట రిపోర్టు చేయాల్సి ఉంటుంది.