నాణ్యమైన, నిరంతర విద్యుత్తే లక్ష్యం

ABN , First Publish Date - 2022-10-28T03:40:44+05:30 IST

దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (జెన్‌కో) మూడో యూనిట్‌ అందుబాటులోకి రావడంతో రాష్ట్ర విద్యుత్‌ రంగంలో మరో ముందడుగు వేశామని సీఎం జగన్‌ అన్నారు.

నాణ్యమైన, నిరంతర  విద్యుత్తే లక్ష్యం

ఈ దిశగా మరో అడుగు థర్మల్‌ యూనిట్‌ ప్రారంభం

తక్కువ బొగ్గు.. మిత కాలుష్యం ప్లాంటు ప్రత్యేకతలు

భూనిర్వాసితులను, మత్స్యకారులను ఆదుకుంటాం

జెన్‌కో మూడో యూనిట్‌ ప్రారంభంలో సీఎం జగన్‌

నెల్లూరు బహిరంగ సభలో ముక్తసరిగా ప్రసంగం

నెల్లూరు, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (జెన్‌కో) మూడో యూనిట్‌ అందుబాటులోకి రావడంతో రాష్ట్ర విద్యుత్‌ రంగంలో మరో ముందడుగు వేశామని సీఎం జగన్‌ అన్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని జెన్‌కో థర్మల్‌ కేంద్రంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన మూడో యూనిట్‌ను సీఎం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. థర్మల్‌ పవర్‌ స్టేషన్‌కు 2008లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారని, ఇప్పుడు మూడో యూనిట్‌ ప్రారంభంతో పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రజల విద్యుత్‌ అవసరాలను తీర్చేందుకు పవర్‌ స్టేషన్‌ ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర విద్యుత్‌ అవసరాలలో దాదాపు 45 శాతం కరెంటు ప్రభుత్వరంగ విద్యుత్‌ సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయని పేర్కొన్నారు. ‘‘జెన్‌కో మూడో యూనిట్‌ నిర్మాణం కోసం యుద్ధ ప్రాతిపాదికన రూ. 3200 కోట్లు ఖర్చుచేసి మూడేళ్ల నాలుగు నెలల కాలంలోనే పూర్తిచేశాం. ఈ ప్లాంటు నుంచి రోజుకు 19 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఏపీ గ్రిడ్‌కు సరఫరా అవుతుంది. సాధారణ ఽథర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌తో పోల్చితే సూపర్‌ క్రిటికల్‌ సాంకేతికత కలిగిన ఈ ప్లాంట్లు తక్కువ బొగ్గుతో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల కాలుష్యం కూడా తక్కువే’’నని వివరించారు. నాణ్యమైన నిరంతర విద్యుత్‌ రోజంతా సరఫరా చేయడంతో పాటు వ్యవసాయ రంగానికి 9గంటల ఉచిత విద్యుత్‌ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటోందని తెలిపారు.

దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు, కృష్ణపట్నం పోర్టుకు భూములిచ్చిన కుటుంబాలకు మంచి జరిగేలా చర్యలు తీసుకొంటున్నామని, ఇదివరకే 326 కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చామని, మిగిలిన 150 కుటుంబాలకు నవంబరు నెలలో ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేలా పోర్టు కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, మత్స్యకారేతరులు మొత్తం 16,337 కుటుంబాలకు రూ.36 కోట్లు అందజేస్తున్నామని చెప్పారు. అనంతరం సభా వేదికపై నుంచి బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో ప్యాకేజీ మొత్తం జమ చేశారు. కాగా, ఇటీవల నెల్లూరులో పెన్నానదిపై నిర్మించిన బ్యారేజీకి కోవూరు ఎమ్మెల్యే నలపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తండ్రి నలపురెడ్డి శ్రీనివాసులురెడ్డి బ్యారేజీగా నామకరణం చేస్తున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. ముదివర్తి, ముదివర్తిపాలెం మద్య సబ్‌మెర్జబుల్‌ కాజ్‌వే నిర్మాణానికి రూ.93 కోట్లు కేటాయించామని, ఈ వేదికపై నుంచే ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తున్నామని సీఎం ప్రకటించారు. కాగా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ప్రసంగంలో మీడియాపై రుసరుసలాడారు. ప్రజల కోసం ఎంతో చేస్తున్నా తామేదో తప్పు చేస్తున్నట్లు పనిగట్టుకొని కొన్ని చానళ్లు, పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ అక్కసు వెళ్లగక్కారు. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గంట సభకు రోజంతా తంటా

నేలటూరులో సీఎం జగన్‌ పర్యటన పట్టుమని గంట సేపు కూడా లేదు. అందులో సభా వేదికపై సీఎం ఉన్న సమయం 30 నిమిషాలు. డప్‌.. డప్‌... డప్‌ అంటూ మైక్‌ పలకరింపులు, అభివాదాల సమయాన్ని మినహాయిస్తే ఆయన ప్రసంగ సమయం కేవలం 12 నిమిషాలు. ఈ కాసిని మాటల కోసం అధికార పార్టీ నాయకులు, అధికారులు పెద్ద హంగామానే చేశారు. నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ బస్సుల సంఖ్య 600 అయితే అందులో 300 బస్సులను సీఎం సభ కోసం జనాలను తరలించడానికి మళ్లించారు. ఫలితంగా ఆర్టీసీ యాజమాన్యం గురువారం గ్రామీణ ప్రాంత సర్వీసులన్నిటినీ రద్దు చేసింది. దీంతో బస్సులు లేక ప్రయాణికులు అల్లాడిపోయారు. తమ బస్సులనూ జనం తరలింపునకు తీసుకోవడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు విద్యాసంస్థలన్నీ గురువారం సెలవు ప్రకటించుకున్నాయి. మరోవైపు జెన్‌కో థర్మల్‌ కేంద్రాన్ని ప్రైవేటీకరించవద్దు అంటూ జిల్లావ్యాప్తంగా ఏపీ జెన్‌కో జేఏసీ, పరిరక్షణ కమిటీ, వామపక్ష నాయకులు ఆందోళనలు చేశారు. నెల్లూరులో ర్యాలీ నిర్వహిస్తున్న ఉద్యమకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఎం పర్యటనను అడ్డుకుంటారనే నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా తెలుగుదేశం, వామపక్ష నాయకులను గురువారం తెల్లవారుజామునే హౌస్‌ అరె్‌స్టలు చేశారు.

Updated Date - 2022-10-28T03:40:46+05:30 IST