చింతూరు-భద్రాచలానికి 35 కిలోమీటర్లంట!

ABN , First Publish Date - 2022-09-21T09:09:39+05:30 IST

చింతూరు-భద్రాచలానికి 30 నుంచి 35 కిలోమీటర్ల దూరమేనంటూ అసెంబ్లీ సాక్షిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని

చింతూరు-భద్రాచలానికి 35 కిలోమీటర్లంట!

అసెంబ్లీ సాక్షిగా మంత్రి విడదల రజని వ్యాఖ్యలు

ఏజెన్సీ వాసుల విస్మయం.. వాస్తవ దూరం 65 కిలోమీటర్లు

గతిలేకే భద్రాచలం ఆస్పత్రికి వెళ్తున్నామంటున్న జనం


చింతూరు, సెప్టెంబరు 20: చింతూరు-భద్రాచలానికి 30 నుంచి 35 కిలోమీటర్ల దూరమేనంటూ అసెంబ్లీ సాక్షిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ప్రకటించడంపై ఏజన్సీ వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విలీన మండలాల్లో ప్రబలుతున్న విష జ్వరాలు, డెంగీ మరణాలపై మంగళవారం అసెంబ్లీలో టీడీపీ సభ్యులు నిమ్మల రామానాయుడు మాట్లాడారు. ఏజెన్సీ వాసులకు పూర్తిస్థాయిలో వైద్యం అందక తెలంగాణలోని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి, ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్న విషయాన్ని ఆయన సభ దృష్టికి తెచ్చారు. దీనిపై మంత్రి రజని జవాబిస్తూ.. చింతూరుకు భద్రాచలానికి కేవలం 30 నుంచి 35 కిలోమీటర్ల దూరమేనని, ఈ విషయాన్ని టీడీపీ సభ్యులు తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. అందుకే విలీన మండలాల ప్రజలు భద్రాచలం వెళ్లి వైద్యం చే యించుకుంటున్నారన్నారు. వాస్తవానికి చింతూరుకు భద్రాచలం 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. వరరామచంద్రపురం, కూనవరాలకు కూడా 50 నుంచి 60 కిలోమీటర్ల దూరం ఉంది. మంత్రి వ్యాఖ్యలు ఈ ప్రాంత వాసులను ఆశ్చర్యానికి గురిచేసింది.


దగ్గరని కాదని, గతి లేక భద్రాచలం వెళుతున్నామని స్థానికులు అంటున్నారు. చింతూరు ఏరియా ఆస్పత్రిలో ఒక్క రెగ్యులర్‌ వైద్యుడు కూడా లేకపోవడంతో రాజమండ్రి నుంచి వారానికి ఒక వైద్యుడు డిప్యుటేషన్‌పై చింతూరు వచ్చి వైద్య సేవలందిస్తున్నారు. వైద్య సదుపాయాలు, పూర్తి స్థాయి వైద్యం, మందులు అందుబాటులో లేకనే ఈ ప్రాంతవాసులు గతిలేక భద్రాచలం ఏరియా ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2022-09-21T09:09:39+05:30 IST