Opposition leader Yanamala Ramakrishna : బీసీలకు ఇచ్చిన పదవులన్నీ రెడ్లతో నింపారు

ABN , First Publish Date - 2022-10-28T03:44:03+05:30 IST

తెలుగుదేశం ప్రభుత్వం బీసీ వర్గాల వారికి ఇచ్చిన నామినేటెడ్‌ పదవులను జగన్‌రెడ్డి ప్రభుత్వం సొంత సామాజిక వర్గానికి చెందిన రెడ్లతో నింపుతోందని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు

Opposition leader Yanamala Ramakrishna : బీసీలకు ఇచ్చిన పదవులన్నీ రెడ్లతో నింపారు
ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు

విజయసాయి ఆధ్వర్యంలో బీసీల సమావేశం సిగ్గుచేటు: యనమల

అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం ప్రభుత్వం బీసీ వర్గాల వారికి ఇచ్చిన నామినేటెడ్‌ పదవులను జగన్‌రెడ్డి ప్రభుత్వం సొంత సామాజిక వర్గానికి చెందిన రెడ్లతో నింపుతోందని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాకు ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘ఏపీఐఐసీ చైర్మన్‌, టీటీడీ చైౖర్మన్‌, విశ్వవిద్యాలయ ఉపకులపతులు, సలహాదారులు, ప్రభుత్వ న్యాయవాదులు సహా రాష్ట్రంలోని అనేక కీలక నామినేటెడ్‌ పదవుల్లో టీడీపీ ప్రభుత్వం బీసీలను నియమించింది. అదే పదవులను వైసీసీ ప్రభుత్వం రెడ్లతో నింపింది. విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిధున్‌ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలపై పెత్తనం అప్పగించారు. ఇదేనా బీసీలకు చేస్తున్న సామాజిక న్యాయం?’’ అని ప్రశ్నించారు. బీసీ వర్గాల సమావేశాన్ని వైసీసీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. స్వతంత్య్ర భారతదేశంలో జగన్‌రెడ్డి ప్రభుత్వం చేసినంత ద్రోహం బీసీ వర్గాల వారికి మరే ప్రభుత్వం చేయలేదని విమర్శించారు. తన ఫ్యాక్షనిస్టు మనస్థత్వానికి జగన్‌ సోషలిస్టు ముసుగు వేసుకొనే ప్రయత్నం చేస్తున్నారని యనమల ఎద్దేవా చేశారు.

Updated Date - 2022-10-28T03:44:06+05:30 IST