షర్మిల వాంగ్మూలంతో హంతకులెవరో తేలిపోయింది

ABN , First Publish Date - 2022-11-05T05:25:33+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని సీబీఐ విచారిస్తే వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తెర వెనుక వ్యవహారాలన్నీ బయటకు వస్తాయని తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానించింది.

షర్మిల వాంగ్మూలంతో హంతకులెవరో తేలిపోయింది

జగన్‌ను సీబీఐ విచారిస్తే మొత్తం బయటకు వస్తుంది: టీడీపీ

అమరావతి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని సీబీఐ విచారిస్తే వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తెర వెనుక వ్యవహారాలన్నీ బయటకు వస్తాయని తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానించింది. ఆయన సొంత సోదరి షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంతో హంతకులు ఎవరో తేలిపోయిందని, వారికి ముందూ వెనకా ఉన్నవారెవరో... కాపాడుతున్నవారెవరో తేలాలంటే ముఖ్యమంత్రిని విచారించడం ఒకటే మార్గమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య శుక్రవారం ఇక్కడ అన్నారు. ‘కడప ఎంపీ టికెట్‌ విషయంలోనే వివేకా హత్య జరిగిందని షర్మిల స్పష్టంగా చెప్పారు. చంపిన వారికే టికెట్‌ వచ్చింది. సొంత చెల్లెలు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఇంకా జగన్‌ మౌనం నటించడంలో అర్ధం లేదు. ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు. ‘జగన్‌ ఆదేశాలు లేకుండా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై రాష్ట్ర పోలీసులు కేసు పెట్టే ధైర్యం చేయరు. జగన్‌ అండ చూసుకొనే అవినాశ్‌ రెడ్డి కడప కోర్టులో సీబీఐ అధికారులపై రంకెలు వేశాడు. వివేకా హత్య సమయంలో సాక్ష్యాలను తుడిచివేయడానికి సాక్షిగా ఉన్న సీఐ శంకరయ్య సీబీఐకి వాంగ్మూలం ఇవ్వడానికి ముందుకు వచ్చి తర్వాత వెనక్కు తగ్గడానికి కారణం ఎవరు? ఎవరి ఆదేశంతో నాటి డీజీపీ గౌతం సవాంగ్‌ శంకరయ్యను పిలిపించి బెదిరించి భయపెట్టాడు? ఎవరి ఆదేశంతో శంకరయ్యకు ప్రమోషన్‌ లభించింది? వీటన్నింటిపైనా సీబీఐ అధికారులు జగన్‌ను విచారించాలి’ అని అన్నారు.

Updated Date - 2022-11-05T05:25:34+05:30 IST