Munugode Election Results: కేఏ పాల్‌కు 805 ఓట్లు.. నోటాకు 482

ABN , First Publish Date - 2022-11-06T19:48:11+05:30 IST

మునుగోడు ఉప ఎన్నిక (Munugode By Election)లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్‌ జనానికి ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చి ఆకట్టుకున్నాడు.

Munugode Election Results: కేఏ పాల్‌కు 805 ఓట్లు.. నోటాకు 482
KA Paul

నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక (Munugode By Election)లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్‌ జనానికి ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చి ఆకట్టుకున్నాడు. ఈ ఎన్నికలో ఉంగరం గుర్తుతో ఆయన బరిలో దిగాడు. ప్రచారం సందర్భంగా తన ఆట, పాటలు, స్పీచ్‌తో జనంతో మమేమకయ్యాడు. ఇటీవల పలు ప్రెస్‌మీట్లలో తాను మునుగోడు ఎన్నికలో 50 వేల మెజార్టీతో గెలుస్తున్నానని, తదుపరి సీఎం తానేనని చెప్పుకొచ్చారు. పలుమార్లు ఈవీఎంలను మారుస్తున్నారంటూ ఆరోపణలు కూడా చేశారు. ఆదివారం జరిగిన కౌంటింగ్‌లో 15 రౌండ్లలో ఆయనకు 805 ఓట్లు మాత్రమే వచ్చాయి. కౌంటింగ్‌ జరుగుతున్న సందర్భంగా ఆయన కౌంటింగ్‌ కేంద్రం వద్ద మరోసారి ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి ఈవీఎంలపై తనకు నమ్మకం లేదని టీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి కుట్రలకు పాల్పడ్డాయని తనకు ఇంత తక్కువగా ఓట్లు రావడం ఆశ్చర్యంగా ఉందంటూ పేర్కొన్నారు.

నోటాకు 482 ఓట్లు

ఉప ఎన్నికలో ధన ప్రభావం పెద్దగా కనిపించడంతో నోటాకు పెద్దగా ఓట్లు పడలేదు. కేవలం 482 మంది ఓటర్లు మాత్రమే నోటా బటన్‌ను నొక్కారు. ఈ 482 మందికి మాత్రమే మునుగోడు నియోజకవర్గ బరిలో ఏ ఒక్క అభ్యర్థి కూడా నచ్చకపోవడంతో వారు నోటాకు ఓటు వేశారు. అత్యధికంగా ఓటర్లు టీఆర్‌ఎస్‌, బీజేపీ వైపే మొగ్గు చూపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ ప్రభావితం చూపలేకపోయింది. ఇక నోటాకు వేసిన వారి సంఖ్య కూడా తక్కువగానే ఉండటం విశేషం.

Updated Date - 2022-11-06T19:48:12+05:30 IST