ED Raids: దుబాయ్‌లో మంత్రి గంగుల.. ఇంటి తళాలు పగలగొట్టి ఈడీ దాడులు

ABN , First Publish Date - 2022-11-09T19:38:55+05:30 IST

మంత్రి గంగుల కమలాకర్‌ (Gangula Kamalakar), ఆయన సోదరుల నివాస గృహాలతోపాటు కరీంనగర్‌ జిల్లా (Karimnagar District) కేంద్రంలోని ఐదు గ్రానైట్‌ కంపెనీల కార్యాలయాలపై ఈడీ, ఐటీ అధికారుల బృందాలు దాడులు నిర్వహించాయి.

ED Raids: దుబాయ్‌లో మంత్రి గంగుల.. ఇంటి తళాలు పగలగొట్టి ఈడీ దాడులు

కరీంనగర్‌: మంత్రి గంగుల కమలాకర్‌ (Gangula Kamalakar), ఆయన సోదరుల నివాస గృహాలతోపాటు కరీంనగర్‌ జిల్లా (Karimnagar District) కేంద్రంలోని ఐదు గ్రానైట్‌ కంపెనీల కార్యాలయాలపై ఈడీ, ఐటీ అధికారుల బృందాలు దాడులు నిర్వహించాయి. బుధవారం ఉదయమే కరీంనగర్‌కు చేరుకున్న ఈడీ, ఐటీ బృందాలు (ED IT teams) ఏకకాలంలో శ్వేత, పీఎస్‌ఆర్‌, ఎస్‌వీజీ-1, ఎస్‌వీజీ-2, ఆరవింద్‌ వ్యాస్‌ గ్రానైట్‌ కంపెనీల కార్యాలయాల్లో, ఆయా సంస్థల యజమానుల ఇళ్లలో సోదాలు నిర్వహించాయి. మంత్రి గంగుల కమలాకర్‌ కుటుంబసభ్యులు భాగస్వాములుగా ఉన్న శ్వేత గ్రానైట్‌ కార్యాలయంలో దాడులు నిర్వహించిన అనంతరం మంత్రి క్యాంపు కార్యాలయం, నివాసగృహానికి ఈడీ, ఐటీ బృందాలు చేరుకున్నాయి. మంత్రి ఇటీవల కుటుంబసభ్యులతో కలిసి దుబాయ్‌కి వెళ్లగా ఇంటికి తాళాలు వేసి ఉన్నాయి. ఆయన పీఏ కిషన్‌ప్రసాద్‌ను పిలిపించి ఆయన సమక్షంలో ఇంటి తాళాలను కట్‌ చేయించి ఇంట్లోకి ప్రవేశించి సోదాలు ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సోదాలు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌ అత్తాపూర్‌లోని జనప్రియ అపార్టుమెంట్‌లో ఎస్‌వీజీ-2 గ్రానైట్‌ భాగస్వామి అయిన రవీందర్‌రావు నివసిస్తుండగా అక్కడ కూడా ఈడీ, ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.

పీఎస్‌ఆర్‌ గ్రానైట్‌ యజమాని శ్రీధర్‌రావు హైదరాబాద్‌ (Hyderabad)లో ఉండగా ఆయన గెస్ట్‌హౌస్‌ కం ఆఫీస్‌లో కూడా సోదాలు నిర్వహించారు. కరీంనగర్‌ కమాన్‌సమీపంలో నివాసముంటున్న గ్రానైట్‌ వ్యాపారి అరవింద్‌ వ్యాస్‌, ఎస్‌వీజీ-1 గ్రానైట్‌ యజమాని వేణుగోపాల్‌కార్వా నివాస గృహాల్లో తనిఖీలు నిర్వహించి అన్ని సోదాల్లో లభ్యమైన రికార్డులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఈడీ, ఐటీ అధికారులు సోదాల సమయంలో స్థానిక పోలీసు అధికారులను, మీడియాను ఆయా ప్రాంతాల నుంచి బయటకు పంపించి దూరంగా ఉంచారు. పదేళ్ల క్రితం కరీంనగర్‌కు చెందిన ఎనిమిది గ్రానైట్‌ కంపెనీలు విదేశాలకు గ్రానైట్‌ రవాణాలో అక్రమాలకు పాల్పడి ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లజేశారని ఆరోపణలు వచ్చాయి. 2013లో విజిలెన్సు, ఎన్‌ఫోర్సుమెంట్‌శాఖ ఈ వ్యవహారంలో విచారణ జరిపించి ఆయా కంపెనీలు తప్పుడు కొలతలతో 124 కోట్ల 94 లక్షల రూపాయల విలువచేసే గ్రానైట్‌ను అక్రమంగా రవాణా చేశాయని తేల్చి ఇందుకుగాను ఐదు రెట్ల ఫెనాల్టీని విధించింది. 749 కోట్ల 64 లక్షల రూపాయలను చెల్లించాలని నోటీసులను ఈడీ జారీ చేసింది.

Updated Date - 2022-11-09T19:38:56+05:30 IST