గ్రూప్‌-1 అభ్యంతరాలపై నిపుణుల కమిటీలు

ABN , First Publish Date - 2022-11-10T05:11:54+05:30 IST

గ్రూప్‌-1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష కీపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించడానికి టీఎ్‌సపీఎస్సీ నిపుణుల కమిటీలను ఏర్పాటుచేసింది...

గ్రూప్‌-1 అభ్యంతరాలపై నిపుణుల కమిటీలు

వారం రోజుల్లో ఫైనల్‌ కీ.. కోర్టు కేసుపై స్పష్టత వచ్చాకే ఫలితాలు

హైదరాబాద్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష కీపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించడానికి టీఎ్‌సపీఎస్సీ నిపుణుల కమిటీలను ఏర్పాటుచేసింది. అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలను కమిటీలు పరిశీలించి వారం రోజుల్లో ఫైనల్‌ కీని ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను మాత్రం కోర్టు కేసుపై స్పష్టత వచ్చాకే విడుదల చేయనున్నారు. గ్రూప్‌-1 పోస్టుల భర్తీలో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రోస్టర్‌ విధానంపై కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కొంత స్పష్టత వచ్చిన తర్వాతే ప్రిలిమినరీ ఫలితాలను ప్రకటించాలని టీఎ్‌సపీఎస్సీ అధికారులు భావిస్తున్నారు. ఒకవైపు కేసు కొనసాగుతుండగా ఫలితాలను ప్రకటిస్తే న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి రావొచ్చని అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మెయిన్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు కమిషన్‌ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేసుల కారణంగా ప్రిలిమినరీ ఫలితాలు ఆలస్యం అయితే... ఆ మేరకు మెయిన్‌ పరీక్షల నిర్వహణలో కూడా జాప్యం జరిగే అవకాశం ఉంది, కాగా విమెన్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ ఛైల్డ్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌లో గ్రేడ్‌-1అధికారుల పోస్టులకు టీఎ్‌సపీఎస్సీ ఎడిట్‌ ఆప్షన్‌ కల్పించింది. గురువారం నుంచి ఈ నెల 12లోగా సరిదిద్దుకోవచ్చు.

Updated Date - 2022-11-10T05:11:55+05:30 IST