బేతుపల్లి చెరువులో చేపల వేట సాగేనా?

ABN , First Publish Date - 2022-04-04T04:58:33+05:30 IST

ఏళ్లుగా బేతుపల్లి చెరువులో చేపల వేట సజావుగా సాగుతుండగా మూడేళ్ల నుంచి మాత్రం ఆగింది.

బేతుపల్లి చెరువులో చేపల వేట సాగేనా?
బేతుపల్లి చెరువు

మూడేళ్లుగా వలవేయని జాలర్లు..

 కొత్త కమిటీ వస్తేనే మేలు..

 నేడు చేపల వేటకు టెండర్లు

సత్తుపల్లి, ఏప్రిల్‌ 3: ఏళ్లుగా బేతుపల్లి చెరువులో చేపల వేట సజావుగా సాగుతుండగా  మూడేళ్ల నుంచి మాత్రం ఆగింది. చివరగా 2020లో చేపల విక్రయాలు సాగగా అప్పటి నుంచి ఇప్పటి వరకు చేపల వేట ఆగింది. ఇందుకు కారణంగా సొసైటీ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం, ప్రభుత్వం చొరవ చూపకపోవడమేనని వాదనలు ఉన్నాయి. ఈ చుట్టుప్రాంతాలకు ప్రధానంగా చేపల కోసం ఇక్కడికే వస్తుంటారు. ఇక్కడి నుంచి ఏటా సుమారు 50టన్నుల వరకు చేప విజయవాడ, మధిర, చింతలపూడి, ఏలూరు తదితర ప్రాంతాలకు చేరుతుంటాయి. అయితే రెండేళ్లు చేపలు పట్టక పోవడంతో ఒక్కో చేప 9కేజీల వరకు బరువు పెరిగినట్లు రెవెన్యూ, మత్స్య శాఖ అధికారులు పరిశీలించారు. సోమవారం టెండర్‌ ప్రక్రియ ద్వారా చేపల విక్రయానికి అధికారులు ప్రకటన చేశారు.

కొత్త కమిటీ వేయాల్సిందే..

బేతుపల్లి గంగారం మత్స్య సహకారం సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఏటా చేపలు పడుతుంటారు. చివరగా 2020లో చేపలను పట్టి విక్రయించగా రూ.12లక్షలు మాత్రమే ఆదాయం వచ్చినట్లు అప్పటి కమిటీ లెక్కలు చూపినట్లు తెలిసింది. కాగా రూ.42లక్షల వరకు ఆదాయం వచ్చిందని, తప్పుడు లెక్కలు చూపుతున్నారని వాదిస్తూ 300మందికిపైగా ఉన్న గ్రూపు సభ్యులు వాగ్వివాదానికి దిగారు. ఇక్కడి అప్పటి నుంచి ఇప్పటి వరకు చెరువులో ఒక్క చేప కూడా బయటకు రాలేదు. మునుపెన్నడూ లేనివిధంగా రెండేళ్లు విస్తారంగా వర్షాలు కురవడంతో అలుగు ద్వారా చాలా వరకు చేపలు కిందికి కొట్టుకుపోయాయనే కూడా ఆందోళన వ్యక్త చేశారు. అయితే ఇన్ని సమస్యలకు పరిష్కారం కొత్త కమిటీ వేయాల్సిందేనని మెజార్టీ సభ్యులు చెబుతుండగా ఆ కమిటీలో కూడా గతంలోని తాత్కాలిక కమిటీ సభ్యులు నిర్ణయించిన వారే ఉండాలని చెబుతున్నారని, ఇదంతా జరిగే పని కాదంటూ అధికారులే ముందుకు వచ్చి టెండర్‌ ప్రక్రియకు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి గతనెలలో గంగారంలో కూడా సమావేశమవ్వగా 150మంది సభ్యులు నిర్ణయం ప్రభుత్వానికే వదిలేశారు. సోమవారం టెండర్‌ ప్రక్రియ సాగనుంది.


Updated Date - 2022-04-04T04:58:33+05:30 IST