సింగరేణి ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయాలి
ABN , First Publish Date - 2022-04-19T05:30:00+05:30 IST
సింగరేణి ప్రాజెక్టుల ఏరియాలో మరింత అభివృద్ధి జరపాలని ప్రజా ప్రతినిధులు, కార్మికసంఘాల ప్రతినిధులు యాజమా న్యానికి విజ్ఞప్తి చేశారు.
వీకే 7 ఓపెన్కాస్టు నిరాశ్రయులను ఆదుకోవాలి
ప్రజల సమస్యలపై నిరంతరం సమీక్షలు జరపాలి
కే7ఓపెన్కాస్టు ప్రజాభిప్రాయసేకరణలో ప్రజాప్రతినిధులు,కార్మికసంఘాల ప్రతినిధులు
రుద్రంపూర్(సింగరేణి), ఏప్రిల్19: సింగరేణి ప్రాజెక్టుల ఏరియాలో మరింత అభివృద్ధి జరపాలని ప్రజా ప్రతినిధులు, కార్మికసంఘాల ప్రతినిధులు యాజమా న్యానికి విజ్ఞప్తి చేశారు. సింగరేణి కాలరీస్ కొత్తగూడెం ఏరియాలోని వీకే ఓపెన్కాస్టు ఏర్పాటు కోసం మంగళ వారం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా పోల్యూషన్ కంట్రోల్ ఈఈ రవిశంకర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా జనరల్మేనేర్ సీహెచ్. నర్సింహారావు మాట్లాడుతూ వీకే ఓపెన్కాస్టు ఏర్పాటు వల్ల బొగ్గు ఉత్పత్తి తో పాటు కార్మికులకు ఉపాధిఅవకాశాలు ఉంటాయని తెలిపారు. వివిధ డిపార్టుమెంట్లో 2,736 మంది కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. గౌతంఖని ఓపెన్కాస్టు నుంచి వెలికి తీసిన బొగ్గుస్థానంలో వీకే ఓపెన్కాస్టు ఓబీని జీకేఓసీలో నింపే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే సమీప ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం వీకే7 వల్లనష్టపోతున్న భూ నిర్వాసితులకు సమీప ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చుతుందో బహిరంగ పర్చాలన్నారు. ఓపెన్కాస్టుల ఏర్పాటుపై జరిగే ప్రజాభిప్రాయసేకరణ ప్రతి ఏడాదికి నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఓపెన్కాస్టు వల్ల ఏర్పడే శబ్ధ, వాయువు వల్ల జరిగే నష్టాలను సరి చేయాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. జిల్లా ప్రజాపరిషత్ వైస్చైర్మన్ కంచర్ల చంద్రశేకర్రావు మాట్లాడుతూ ఓపెన్కాస్టు ప్రభావిత ప్రాంతాలైన నిమ్మలగూడెంలో కిడ్ని వ్యాదిగ్రస్తుల సంఖ్య పెరుగుతుందని వారికి శుద్దిచేసే మంచినీటి సదుపాయాన్ని అందించాలని కోరారు. గ్రామాల మౌళిక సదుపాయాలకు నిధులు మంజూరు చేయాలన్నారు. కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ కార్మికప్రాంతాల అభివృద్ధి కోసం ప్రణాళిక బద్దంగా పనులు చేపట్టాలని కోరారు. తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం ఉపాధ్యక్షులు ఎండి. రజాక్ మాట్లాడుతూ బొగ్గు అవసరాలు పెరుగుతున్న తరుణంలో నూతన ప్రాజక్టుల ఏర్పాటు అనివార్యమని వీకే 7 ఓసీ ఏర్పాటు చేయడం ద్వారా మరింత బొగ్గు ఉత్పత్తిని చేసే అవకాశం ఉందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటన జరగకుండా పోలీస్ బందో బస్తును ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే. సాబీర్పాషా, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్, టీబీజీకేఎస్ నాయకులు కాపు కృష్ణ, కూసన వీరభద్రయ్య, చెన్న కేశవులు, నాగరాజు, జాతీయ కార్మికసంఘాల నాయకులు డి. శేషయ్య, త్యాగరాజన్, గ్రామసర్పంచ్లు కళావతి, సీత, ఉపసర్పంచ్ కంఠ సంతోష్, కార్మికసంఘాల ప్రతినిధులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.