CM KCR Tour: మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేడు

ABN , First Publish Date - 2022-12-04T10:08:52+05:30 IST

సీఎం కేసీఆర్‌ (CM KCR) ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ నుంచి రోడ్డు మార్గంలో రానున్నారు.

CM KCR Tour: మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేడు

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ (CM KCR) ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ నుంచి రోడ్డు మార్గంలో రానున్నారు. 12:45 గంటలకు నేరుగా మహబూబ్‌నగర్‌లోని టీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసుకు చేరుకుని కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అక్కడ కొద్దిసేపు గడిపిన తర్వాత 1:30 గంటలకు నూతన కలెక్టరేట్‌కు చేరకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) ప్రారంభం చేస్తారు. అనంతరం అక్కడే అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారు. అక్కడి నుంచి 3:50కి బయలుదేరి 4:00 గంటలకు ఎంవీఎస్ ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. అనంతరం 5:10 గంటలకు కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌లోని హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

సీఎం పర్యటనకు సర్వం సిద్ధం

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగే ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు పర్యటనకు సర్వం సిద్ధమైంది. ఎక్సైజ్‌, క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌, కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు నేతృత్వంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఐజీపీ కమలాసన్‌రెడ్డి నేతృత్వంలో పోలీస్‌ యంత్రాంగం బందోబస్తు చర్యలు చేపట్టింది. పాలకొండ రెవెన్యూ శివారులో నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌), టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవంతో పాటు నిర్మించతల పెట్టిన మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి, బర్డ్స్‌ ఎన్‌క్లోజర్‌, శిల్పారామం ఆర్చీ, ట్యాంక్‌బండ్‌ వద్ద నిర్మిస్తోన్న తీగల వంతెన, ఐల్యాండ్‌ పనుల శంకుస్థాపనను సీఎం చేతుల మీదుగా చేయించనున్నారు. నూతన కలెక్టరేట్‌లో అన్ని కార్యాలయాలను పూలమాలలతో అలంకరించారు. కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ను త్రివర్ణమయంగా రంగురంగుల దీపాలతో అలంకరించారు.

కాగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మహబూబ్‌నగర్‌ పర్యటన సందర్భంగా ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పాలమూరుకు సీఎం, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు స్పష్టమైన ప్రకటన ఈ పర్యటనలో వస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ పర్యటనతోనైనా పెండింగ్‌ సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయనే ఆశ స్థానికుల్లో వెల్లడవుతోంది. రిజర్వాయర్లకే పరిమితమైన పాలమూరు దాదాపు 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గడచిన ఆరేళ్లలో రిజర్వాయర్ల నిర్మాణాలకే పరిమిత మైంది. ఎన్జీటీ, భూపరిహారానికి సంబంధించిన కేసులతో పథకం నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. ఈ పథకాన్ని రెండున్న రేళ్లలో పూర్తి చేస్తామని, భూములు కోల్పోయిన రైతులకు ఆయకట్టులోనే భూములకు భూములిస్తామ ని, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా సీఎం ఇచ్చిన హామీ నెరవేరకపోవడంపై నిర్వాసితుల్లో ఆందోళన వ్యక్త మవుతోంది. ఈ పథకం కింద రిజర్వాయర్ల నిర్మాణాలు దాదాపు 80 శాతం వరకు పూర్తయితే, ఆయకట్టుకు నీరందించాల్సిన ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ నిర్మాణాలకు ఇంతవరకు కార్యాచరణ మొదలుపెట్టలేదు. ప్రధానంగా ఈ ప్రాజెక్టే ప్రధాన ఆదెరువు అయిన నారాయణపేట జిల్లాకు ఉద్దేశించిన కరివెన- నారాయణపేట కాల్వకు డిజైన్‌ ఖరార య్యిందే తప్ప పనులు మొదలు కాకపోవడంపై స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అదేకాల్వ ఆధారంగా జయమ్మ చెరువును రిజర్వాయర్‌గా మార్చే ప్రక్రియను మొదలు పెట్టాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో పాటు అమ్రాబాద్‌ ఎత్తిపోతల పథకం, సీఎం స్వయంగా ప్రకటించిన వెల్టూరు బ్యారేజీ, అలంపూర్‌ నియోజకవర్గంలో తుమ్మిళ్ల పనుల పూర్తిపైనా రైతాంగం ఆశలు పెంచుకుంది. నారాయణపేట జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీ రిచ్చే జీవో నంబర్‌ 69 ద్వారా ప్రతిపాదించిన కొడంగల్‌-నారాయణపేట లిఫ్టుని చేపట్టాలని, అదేవిధంగా పాలమూరు ఎత్తిపోతల ను రెండో భాగంగా జూరాల నుంచి చేపట్టేందుకు జీవో నంబర్‌ 72 అమలు చేయాలని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Updated Date - 2022-12-04T10:08:55+05:30 IST