జిల్లాలో జోరుగా పేకాట

ABN , First Publish Date - 2022-10-26T01:15:52+05:30 IST

జిల్లా వ్యాప్తంగా దీపావళి పండుగలో పేకాట రాయుళ్లు త మ జోరును కొనసాగించారు.

జిల్లాలో జోరుగా పేకాట

100 మందిపై కేసులు నమోదు

రూ.9,08,570 స్వాధీనం

జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పేకాట నిర్వహణ

ఖిల్లా, అక్టోబరు 25 (నిజామాబాద్‌): జిల్లా వ్యాప్తంగా దీపావళి పండుగలో పేకాట రాయుళ్లు త మ జోరును కొనసాగించారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక స్థావరాల్లో పేకాటను ఆడారు. పేకాటను నియంత్రించేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. పేకాట జోరు తగ్గలేదు. దీపావళి పండుగను పురస్కరించుకుని ఆనవాయితీగా వస్తున్న పేకాటను జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా ప్రత్యేక ప్రాంతాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకుని మరీ పేకాటను ఆడారు. సీపీ నాగరాజు పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినా ఆటను నియంత్రించలేక పోయారు.

దీపావళి రోజు..

దీపావళి రోజు సోమవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా పేకాట ఆడుతున్న స్థావరాలపై పోలీసులు దాడులు చేసి మొత్తం 100 మందిపై కేసులు నమోదు చేసి వారి వద్ద నుంచి మొత్తం 9లక్షల 08,570 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్‌ డివిజన్‌లో మొత్తం 372 మందిపై 58 కేసులను నమోదు చేసి రూ.5,62,590 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలో 108 మందిపై 21 కేసులు నమోదు చేసి వారి వద్ద నుంచి రూ. 1,53,880 నగదును స్వాధీనం చేసుకున్నారు. బోధన్‌ డివిజన్‌లో 107మందిపై మొత్తం 21కేసులు నమోదు చేసి రూ.1,92,100 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్‌ కేఆర్‌ నాగరాజు తెలిపారు.

వర్నిలో 74 మంది..

వర్ని: మండలంలో పేకాట ఆడుతున్న 74 మందిని అరెస్టు చేసినట్టు ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.1,44,000లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

మాక్లూర్‌లో 26 మంది..

మాక్లూర్‌: మండంలోని చిక్లి, చిన్నాపూర్‌ గ్రామాల్లో పేకాట ఆడుతున్న 26 మందిని అరెస్టు చేసి రూ.53వేల680 నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై యాదగిరిగౌడ్‌ తెలిపారు.

జక్రాన్‌పల్లిలో 18 మంది..

జక్రాన్‌పల్లి: మండలంలోని బ్రాహ్మణ్‌పల్లి, తొర్లికొండ గ్రామ శివారులో సోమవారం రాత్రి పొలాల్లో పేకాట ఆడుతున్న 18మందిని అరెస్టు చేసినట్టు ఎస్సై కుంట శ్రీకాంత్‌ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.52వేల640లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

ముప్కాల్‌ ఆరుగురు..

ముప్కాల్‌: మండలంలోని నల్లూర్‌లో పేకాడుతున్న ఆరుగురిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.5140 నగదు స్వాధీనం చేసుకున్నటు ఎస్సై ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

కమ్మర్‌పల్లిలో 15 మంది

కమ్మర్‌పల్లి: మండలంలోని మూడు గ్రామాల్లో సోమవారం రాత్రి పేకాడుతున్న 15 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్‌ తెలిపారు. వీరి వద్ద నుంచి 12వేల 280 రూపాయల నగదు, 7 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకునట్లు తెలిపారు.

నవీపేటలో 43 మంది..

నవీపేట: మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం రాత్రి పేకాట ఆడుతున్న 43 మందిని అరెస్టు చేసి వీరి వద్ద నుంచి రూ.38,490స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆర్మూర్‌లో 25మంది..

ఆర్మూర్‌టౌన్‌: మున్సిపల్‌ పరిధిలోని ఆర్మూర్‌, మామిడిపల్లి, పెర్కిట్‌ 25మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేసి రూ.66వేల220 నగదును స్వాధీనం చేసుకున్నట్టు స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ సురేష్‌బాబు తెలిపారు.

Updated Date - 2022-10-26T01:16:36+05:30 IST