పీహెచ్సీల్లో సీసీ నిఘా!
ABN , First Publish Date - 2022-11-05T00:09:08+05:30 IST
ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆరోగ్య కేంద్ర సిబ్బంది పనితీరు, వారు విధులకు హాజరయ్యే సమయాలు, విధుల్లో అందిస్తున్న సేవలను రాష్ట్ర అధికారులు దృశ్య మాధ్యమం ద్వారా రోజూ నేరుగా పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే సీసీ కెమెరాల బిగింపు పూర్తయింది. హైదరాబాద్లోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్కు అనుసంధానిస్తున్నారు.
ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మూడేసి సీసీ కెమెరాల ఏర్పాటు
డాక్టర్, ల్యాబ్, ఫార్మసీ గదుల్లో బిగింపు
వైద్యారోగ్య శాఖ డైరెక్టరేట్ కమాండ్ కంట్రోల్కు అనుసంధానం
సిబ్బంది పనితీరుపై హైదరాబాద్ నుంచే ఉన్నతాధికారుల పర్యవేక్షణ
ప్రజలకందే వైద్య సేవల్లో మెరుగుదలకే చర్యలు
ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆరోగ్య కేంద్ర సిబ్బంది పనితీరు, వారు విధులకు హాజరయ్యే సమయాలు, విధుల్లో అందిస్తున్న సేవలను రాష్ట్ర అధికారులు దృశ్య మాధ్యమం ద్వారా రోజూ నేరుగా పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే సీసీ కెమెరాల బిగింపు పూర్తయింది. హైదరాబాద్లోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్కు అనుసంధానిస్తున్నారు. ఒక్కో పీహెచ్సీలో డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ గదుల్లో ఒక్కోటి చొప్పున సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కెమెరాల నిర్వహణను థర్డ్ పార్టీ ఏజెన్సీకి అప్పగించింది.
వికారాబాద్, నవంబరు 4(ఆంధ్రజ్యోతిప్రతినిధి): గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవలందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు త్వరలో నిఘా నీడలోకి రానున్నాయి. వేళాపాళా పాటించకుండా, ఉద్యోగ బాధ్యతలను తప్పించుకు తిరిగే అధికారులు, సిబ్బందికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక వారి ఆటలకు అడ్డుకట్ట వేసే చర్యలకు శ్రీకారం చుట్టునుంది. దీంతో ఉన్నతాధికారులు పీహెచ్సీల పనితీరును నేరుగా పరిశీలించే అవకాశం ఏర్పడనుంది. పీహెచ్సీల్లోని డాక్టర్లు, సిబ్బందిలో కొందరు సమయపాలన పాటించడం లేదు. ఎవరు ఎప్పుడు విధులకు వస్తున్నారో.. ఎప్పుడు వెళ్తున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీల్లో పలుమార్లు నిర్ధారణ కావడంతో ప్రతీ పీహెచ్సీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీహెచ్సీల పనివేళల్లో డాక్టర్లు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండి తగిన సేవలందించేలా పీహెచ్సీల్లో మూడు సీసీ కెమెరాలు పెట్టాలని నిర్ణయించారు. జిల్లాలో 22పీహెచ్సీలుండగా, అన్ని పీహెచ్సీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. ఒక్కో పీహెచ్సీలో ఔట్ పేషెంట్లకు వైద్య సేవలందించే డాక్టర్ గది, ల్యాబ్ టెక్నీషియన్ రూం, ఫార్మాసిస్ట్ గదిలో ఒక్కో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పీహెచ్సీలో డాక్టర్, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ల పనితీరు, వారు విధుల్లో ఎంత సేపు ఉంటున్నారనేది పరిశీలించేందుకే వారు పనిచేసే చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పీహెచ్సీలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు. హైదరాబాద్లోని ప్రజారోగ్య శాఖ డైరెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ వ్యవస్థకు అన్ని పీహెచ్సీల సీసీ కెమెరాలలను అనుసంధానం చేశారు. ఏ పీహెచ్సీలో ఎవరు ఏ పని చేస్తున్నారనేది వైద్యారోగ్య శాఖ మంత్రితో పాటు ప్రజారోగ్య శాఖ ఉన్నతాధికారులు హైదరాబాద్లో తాము ఉన్న చోటు నుంచే పరిశీలిస్తారు. బాగా పనిచేసే వారిని ప్రోత్సహించడం, డ్యూటీ నిర్లక్ష్యం చేసే వారిని తమ పనితీరు మార్చుకునేలా మార్గదర్శనం చేయనున్నారు. ప్రభుత్వం ఆస్పత్రుల్లోనూ ప్రైవేట్ ఆస్పత్రుల మాదిరిగా వైద్యసేవలందించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఈ సీసీ కెమెరాల ఏర్పాటు సైతం ఇమిడి ఉంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం పీహెచ్సీలను పటిష్టపరిచే చర్యలు తీసుకుంటోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీ్షరావు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచిఆసుపత్రులు, పీహెచ్సీల సేవల్లో మరింత మార్పు తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. పీహెచ్సీల బలోపేతానికి ప్రత్యేక దృష్టి పెట్టారు.
థర్డ్ పార్టీ ఏజెన్సీకి నిర్వహణ బాధ్యతలు
జిల్లాలో ఇంతకు ముందు కొన్ని పీహెచ్సీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా నిర్వహణ లోపం కారణంగా చాలా సీసీ కెమెరాలు పనిచేయలేదు. వాటిని బాగు చేయించకుండా వదిలేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీ్షరావు క్షేత్రస్థాయిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది పనితీరును మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పీహెచ్సీల్లో మూడు చోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసే విధంగా నిరంతరం పర్యవేక్షించే బాధ్యతను థర్డ్ పార్టీకి అప్పగించారు. పీహెచ్సీల్లో బిగించిన మూడు సీసీ కెమెరాల్లో అన్ని కెమెరాలు సక్రమంగా పని చేస్తున్నాయా.. లేదా? అనేది ఎప్పటికప్పుడు సర్వీస్ ఏజెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈసీఐఎస్ సంస్థ పరిశీలిస్తుంది. ఏ పీహెచ్సీలోనైనా కెమెరా పనిచేయకుంటే తమ సాంకేతిక సిబ్బందిని అక్కడకు పంపించి మరమ్మతులు చేయిస్తుంది. సీసీ కెమెరాలు ఏర్పాటుతో డాక్టర్లు, సిబ్బందిలో జవాబుదారీతనం పెరగనుంది. పీహెచ్సీల డాక్టర్లు, సిబ్బంది పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగే అవకాశం ఉంది. పీహెచ్సీలను పటిష్టం చేస్తేనే గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలందుతాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. హైదరాబాద్లోని ప్రజారోగ్య శాఖ డైరెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ వ్యవస్థకు అనుసంధానించిన పీహెచ్సీ కెమెరాల పనితీరు ఎలా ఉందనేది ట్రయల్స్ చేస్తున్నారు. సాంకేతికంగా ఉత్పన్నమయ్యే సమస్యలన్నీ అధిగమించి పీహెచ్సీల్లోని సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్ నియంత్రణలోకి రానున్నాయి.
పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ
పీహెచ్సీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుతో వైద్యాధికారులు, సిబ్బంది సమయ పాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించే అవకాశం ఉంటుంది. పీహెచ్సీలకు ఎవరెవరు వస్తున్నారనేది నిరంతరం సంబంధిత డాక్టర్లు, ఉన్నతాధికారులు పరిశీలించడానికి వీలవుతుంది. అలాగే రోగుల పట్ట వైద్యులు, సిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారు? చికిత్సకు వచ్చే వారితో ఎలా మాట్లాడుతున్నారు? వారి సమస్యలను సావధానంగా వింటున్నారా? విధుల సమయంలో ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, స్థాఫ్నర్సుల పనితీరు ఎలాం ఉంటోంది? అనేది వివరింగా సీసీ ఫుటేజీల్లో నమోదు కానున్నాయి. దీంతో రోగులకూ మరింత మెరుగైన వైద్యం అందుతుందనడంలో సందేహం లేదు. అత్యవసర పరిస్థితులు, సీజనల్ వ్యాధుల నియంత్రణ, ప్రభుత్వం నిర్వహించే ఆరోగ్య కార్యక్రమాల అమలుపై ఉన్నతాఽధికారులు నేరుగా పీహెచ్సీ డాక్టర్, సిబ్బందితో మాట్లాడి అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో పీహెచ్సీలకు భద్రత ఏర్పడుతుంది.