ABN Andhra Jyoti: దుమ్మురేపుతున్న దమ్మున్న చానల్‌

ABN , First Publish Date - 2023-06-10T02:53:45+05:30 IST

ఒక్క చాన్స్‌ అంటూ ప్రజల్లోకి వెళ్లి వారిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా గొంతు నొక్కుతున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు ఊహించని షాక్‌ తగిలింది.

ABN Andhra Jyoti: దుమ్మురేపుతున్న దమ్మున్న చానల్‌

యూట్యూబ్‌లో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి

డిజిటల్‌ చానల్‌ హవా

న్యూస్‌ చానల్స్‌ రేటింగ్‌లో

జాతీయ స్థాయిలో నాలుగో స్థానం

హైదరాబాద్‌, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): ఒక్క చాన్స్‌ అంటూ ప్రజల్లోకి వెళ్లి వారిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా గొంతు నొక్కుతున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానల్‌ను బ్యాన్‌ చేస్తే తాను ఏం చేసినా తెలియదని, తన కూలి మీడియాతో మభ్యపెట్టవచ్చని భావించిన జగన్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఝలక్‌ ఇచ్చారు. కేబుల్‌ కనెక్షన్ల ద్వారా రాకపోయినా వాస్తవాలను తెలుసుకునేందుకు ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి డిజిటల్‌ చానల్‌ను యూట్యూబ్‌లో ఆదరిస్తున్నారు. జగన్‌ సర్కారు ఎన్ని కుట్రలు చేసినా తాము మాత్రం దమ్మున్న చానల్‌ ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిని చూస్తామని తేల్చిచెప్పారు. ఏపీలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానల్‌ను కేబుల్‌ కనెక్షన్ల ద్వారా ప్రజలు వీక్షించకుండా వైసీపీ ప్రభుత్వం కట్టడి చేసింది. అయితే డీటీహెచ్‌ల ద్వారా ప్రజలు చూస్తున్నారు. అలాగే ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి డిజిటల్‌ చానల్‌ను యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షిస్తున్నారు. దీంతో వాస్తవిక సమాచారాన్ని నిరంతరాయంగా అందిస్తూ తెలుగు ప్రజల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి డిజిటల్‌ మీడియాలో మరో అరుదైన ఘనత సాధించింది.

యూట్యూబ్‌లో ఎక్కువ మంది వీక్షిస్తున్న భారతీయ వార్తా ఛానళ్ల జాబితాలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి 4వ స్థానంలో నిలిచింది. యూట్యూబ్‌ డేటా ప్రకారం.. గతంతో పోల్చితే ఏకంగా 20 స్థానాలు మెరుగుపడి 4వ స్థానానికి ఎగబాకింది. ఇప్పుడు జీ న్యూస్‌, ఆజ్‌ తక్‌, టీవీ9 మరాఠీ తర్వాత ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి డిజిటల్‌ చానలే ఉంది. అత్యధికంగా వీక్షించే ఛానళ్ల సరసన నిలిపి ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిని తెలుగు ప్రజలు ఆదరిస్తున్న తీరుకు ఈ ర్యాంకింగ్‌ సాక్ష్యంగా నిలిచింది. దమ్మున్న ఛానల్‌గా ఏబీఎన్‌ యూట్యూబ్‌ వేదికగా దుమ్మురేపడంలో తెలుగు వీక్షకుల తోడ్పాటు మరువలేనిది. జగన్‌ సర్కారు కేబుల్‌ కనెక్షన్లలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానల్‌ రాకుండా చేయడం ద్వారా మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు పరిణామాలతో పాటు ప్రభుత్వ అవినీతిని ప్రజలకు తెలియకుండా కట్టడి చేయాలని చూస్తోంది. దీంతో ప్రజలు యూట్యూబ్‌లో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి డిజిటల్‌ చానల్‌ను వీక్షించి వాస్తవాలు తెలుసుకుంటున్నారు. బహిరంగ సభల్లో అదే పనిగా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిపై అక్కసు వెళ్లగక్కే జగన్‌ ఏపీలో విధించిన బ్యాన్‌ వల్ల సాధించిదేమీ లేదని, తన చేష్టలతో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిని ఇంకా బలోపేతం చేశారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

మరో 1,000 కోట్ల అప్పు..!

అమరావతి, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం మరోసారి అప్పు బాట పట్టింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 13వ తేదీ, మంగళవారం నిర్వహిస్తున్న సెక్యూరిటీల వేలంలో పాల్గొని వైసీపీ ప్రభుత్వం కొత్తగా ఇంకో రూ.1000 కోట్ల అప్పు తీసుకువస్తుంది. ఈమేరకు శుక్రవారం ఆర్బీఐకి ఆర్థిక శాఖ సమాచారం పంపింది. దీనితో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకూ ఆర్బీఐ ద్వారా రూ.19,500 కోట్ల అప్పు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్రం రాష్ట్రానికి రూ.30,275 కోట్ల అప్పునకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఇందులో ఇంకా రూ.10,775 కోట్ల పరిమితి మాత్రమే మిగిలి ఉంది.

Updated Date - 2023-06-10T02:53:45+05:30 IST