CM JAGAN: ముందు నేను... నా వెనుక గాంధీ!
ABN , First Publish Date - 2023-06-14T03:15:54+05:30 IST
‘నేను... నా తర్వాతే ఎవరైనా! తండ్రి వైఎస్ రాజశేఖరెడ్డి అయినా, జాతిపిత మహాత్మాగాంధీ అయినా... నావెనుక నడవాల్సిందే!’ ఇదీ... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు! కుటుంబ సభ్యులు, కొందరు అత్యంత ప్రముఖులకు మాత్రమే ప్రవేశమున్న ‘తాడేపల్లి ప్యాలెస్’లో ఈ చిత్రం బయటపడింది.
తాడేపల్లి ప్యాలెస్లో బయటపడ్డ ‘చిత్రం’
(అమరావతి - ఆంధ్రజ్యోతి): ‘నేను... నా తర్వాతే ఎవరైనా! తండ్రి వైఎస్ రాజశేఖరెడ్డి అయినా, జాతిపిత మహాత్మాగాంధీ అయినా... నావెనుక నడవాల్సిందే!’ ఇదీ... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు! కుటుంబ సభ్యులు, కొందరు అత్యంత ప్రముఖులకు మాత్రమే ప్రవేశమున్న ‘తాడేపల్లి ప్యాలెస్’లో ఈ చిత్రం బయటపడింది. కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్రావు కరాడ్ మంగళవారం తాడేపల్లి ప్యాలెస్లో ముఖ్యమంత్రిని కలిశారు. పరస్పరం శాలువాలు కప్పుకొని సన్మానించుకున్నారు. దీనికి సంబంధించిన చిత్రాలను మీడియాకు విడుదల చేశారు. అందులోనే ఒక అసలు ‘చిత్రం’ బయటపడింది. అందులో... జగన్ వెనుక భారీగా జనం నడుస్తుండగా, ఒకవైపు ఆయన వెనుక వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు. మరోవైపు... మహాత్మాగాంధీ కూడా జగన్ వెనకాలే నడుస్తున్నారు. తండ్రి ఫొటోను ఎలాగైనా, ఎక్కడ వాడుకున్నా అది ఆయన ఇష్టం. కానీ... గాంధీ కూడా తన ముందు చిన్న వాడే అనేలా చిత్రీకరించిన ఫొటోనే జగన్ నివాసంలో ప్రదర్శించుకోవడంపైనే అసలు అభ్యంతరం. ఇక... ‘బీజేపీ అండ, కేంద్రం మద్దతు ఉండకపోవచ్చు’ అని బహిరంగ సభలో జగన్ ఆందోళన వ్యక్తం చేసిన మరుసటి రోజునే, కేంద్ర మంత్రి స్వయంగా జగన్ను కలవడం కొసమెరుపు.