పునాదులే ఇళ్లు.. అక్కడా ఓటర్లు!
ABN , First Publish Date - 2023-12-01T05:23:17+05:30 IST
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ఓటరు జాబితా ముసాయిదా తప్పుల తడకగా ఉంది. నిర్మాణంలో ఉన్న ఇళ్లు, పునాదులకు కూడా ఇంటి నంబర్లు వేసి ఓటరు జాబితాలో చేర్చారు.
వైసీపీ వర్గీయులకు డబుల్, ట్రిపుల్ ఓట్లు
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఓటర్ల జాబితాలో విచిత్రాలు
ధర్మవరం, నవంబరు 30: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ఓటరు జాబితా ముసాయిదా తప్పుల తడకగా ఉంది. నిర్మాణంలో ఉన్న ఇళ్లు, పునాదులకు కూడా ఇంటి నంబర్లు వేసి ఓటరు జాబితాలో చేర్చారు. కొందరికి రెండు మూడు ఓట్లు కల్పించారు. సచివాలయ ఉద్యోగులే బీఎల్ఓలు కావడంతో వారిపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చి, ఇష్టం వచ్చినట్లు జాబితాలను తయారు చేయించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు బీఎల్ఓలు వాస్తవ నివేదికలు పంపినా ఈఆర్వో స్థాయిలో పెండింగ్లో పెడుతున్నట్లు సమాచారం. ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులను ఓటరు జాబితా నుంచి తొలగించడమే లక్ష్యంగా వైసీపీ నాయకులు, వలంటీర్లు ఫారం-7 దరఖాస్తులు చేస్తున్నారు. ధర్మవరం 176,177 పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ వర్గీయులు యుగంధర్, అల్లాడి బాలచంద్రకు మూడేసి ఓట్లు, ఉమాదేవి, అల్లాడి శ్రీనివాసులుకు డబుల్ ఓట్లు ఉన్నాయి. 217లో ఎఫ్రాయిము గూరనూర పేరుతో డబుల్ ఓట్లు, 26వ వార్డులో ఖాజామోహిద్దీన్, అన్సర్ పేరిట డబుల్ ఓట్లు ఉన్నాయి. 238 కేంద్రంలో ఓ పునాదికి ఎన్ఎన్ఓ-2 డోర్ నంబర్ చూపించి లక్ష్మీకాంతమ్మను జాబితాలో చేర్చారు.