చంద్రబాబును కలవాలనుకున్నది ఓటమి భయంతోనే
ABN , First Publish Date - 2023-11-29T04:35:17+05:30 IST
ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్..
కలవడానికి ఆయన ఒప్పుకోలేదు : నారాయణ
ఖమ్మం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్.. టీడీపీ అధినేత చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యాక పరామర్శ పేరుతో ఆయన్ను కలవడానికి ప్రయత్నించారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. అయితే, అందుకు చంద్రబాబు అంగీకరించలేదని చెప్పారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలో నిర్వహించిన కార్యక్రమాలు, విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో హైదరాబాద్లో ఆయన అభిమానులు ధర్నాలు, నిరసనలు చేస్తుంటే కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని, వారి మనోభావాలు దెబ్బతీశారని విమర్శించారు. దీంతో టీడీపీ, చంద్రబాబు అభిమానులు, కార్యకర్తలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకోసం పనిచేస్తున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ద్వారా కాంగ్రెస్, వామపక్షాలు, లౌకిక శక్తులు బీజేపీని ఓడించేందుకు ప్రయత్నిస్తుంటే కేసీఆర్, మోదీ, జగన్మోహన్రెడ్డి కలిసి పనిచేస్తున్నారని, తెలుగు రాష్ట్రాల సీఎంలు మోదీతోనే ఉన్నారని నారాయణ ఆరోపించారు.