Share News

Peddi Reddy : పుంగనూరులో పసుపు కనిపిస్తే చంపేస్తాం!!

ABN , First Publish Date - 2023-10-21T03:33:03+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లా నుంచి కుప్పంనకు సైకిల్‌ యాత్ర చేస్తున్న ఆ పార్టీ కార్యకర్తలపై పుంగనూరులో స్థానిక వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ‘‘పుంగనూరులో పసుపు జెండా కనిపిస్తే చంపేస్తాం.

Peddi Reddy : పుంగనూరులో పసుపు కనిపిస్తే చంపేస్తాం!!

  • ఇది పెద్దిరెడ్డి ఇలాకా... తెలిసే వచ్చారా?

  • సైకిల్‌ యాత్రికులపై వైసీపీ నేతల దాష్టీకం

  • దుస్తులు మార్పించి, జెండాలు తీయించిన పంపిన వైనం

పుంగనూరు, అక్టోబరు 20: టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లా నుంచి కుప్పంనకు సైకిల్‌ యాత్ర చేస్తున్న ఆ పార్టీ కార్యకర్తలపై పుంగనూరులో స్థానిక వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ‘‘పుంగనూరులో పసుపు జెండా కనిపిస్తే చంపేస్తాం. ఇక్కడ ఉండేది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని తెలిసే టీడీపీ జెండాలతో వచ్చారా? ఎంత ధైర్యం ఉంటే నీతిమాలిన చంద్రబాబు కోసం సైకిల్‌ యాత్ర చేస్తారు? సీఎం జగన్‌రెడ్డి ద్వారా పథకాల లబ్ధి పొంది మళ్లీ టీడీపీ జెండాలతో సిగ్గులేకుండా కనిపిస్తారా?’’ అంటూ వీరంగం వేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం సుగాలిమిట్టలో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది.

Peddi-Reddy-Rama.jpg

బాధితులు తెలిపిన ప్రకారం.. అక్టోబరు 2న శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువాక మాజీ సర్పంచి ఎన్‌.రామకృష్ణ, అదే గ్రామానికి చెందిన సీహెచ్‌ రామసూరి, ఎన్‌ సుందరరావు, ఎన్‌ ఆదినారాయణ, ఎస్‌ రమేశ్‌ కలిసి చంద్రబాబుకు మద్దతుగా సైకిల్‌ యాత్ర చేపట్టారు. టీడీపీ, యువగళం జెండాలు, టోపీలు, పసుపు చొక్కాలతో మొదలైన వీరి సైకిల్‌ యాత్ర శుక్రవారం సాయంత్రానికి పుంగనూరు మండలం సుగాలిమిట్టకు చేరింది. ఇక్కడి టీస్టాల్‌ వద్ద ఆగి వీరు టీ తాగుతున్నారు. అటువైపు నుంచి వచ్చిన పుంగనూరు వైసీపీ నేత చెంగళాపురం సూరి మరికొందరు వారి వాహనాన్ని ఆపారు. టీ తాగుతున్న టీడీపీ కార్యకర్తలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పుంగనూరు అని తెలిసి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏరియా అని తెలిసే టీడీపీ జెండాలతో కనిపిస్తారా అని దుర్భాషలాడారు. టీడీపీ జెండాలు తీయించి, జెండా కర్రలు, కండువాలు, వారు ధరించిన పసుపు రంగు చొక్కాలు, టోపీలు తీయించాక వైసీపీ శ్రేణులు కాళ్లతో తొక్కి పక్కన పడేయించారు.

Updated Date - 2023-10-21T10:31:34+05:30 IST