Share News

తిరుమలలో నవ వధువు హఠాన్మరణం

ABN , First Publish Date - 2023-11-30T03:57:07+05:30 IST

వివాహం చేసుకుని భర్త, కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన యువతి తిరుమలలో హఠాన్మరణం చెందింది.

తిరుమలలో నవ వధువు హఠాన్మరణం

బంగారు వాకిలి వద్దే కుప్పకూలిన వైనం

తిరుమల, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): వివాహం చేసుకుని భర్త, కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన యువతి తిరుమలలో హఠాన్మరణం చెందింది. విజయవాడకు చెందిన లక్ష్మీసాయి సంతోషి(21)కి హైదరాబాద్‌కు చెందిన భార్గవ్‌తో ఈనెల 23వ తేదీన వివాహమైంది. నూతన దంపతులు కుటుంబ సభ్యులతో శ్రీవారి దర్శనం కోసం 27న తిరుమలకు వచ్చారు. 28వ తేదీ మఽధ్యాహ్నం స్వామిని దర్శించుకుని బంగారు వాకిలి వద్దకు రాగానే లక్ష్మీసాయి సంతోషి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. విజిలెన్స్‌ సిబ్బంది సాయంతో ఆమెను ఆలయం వెలుపలకు తీసుకువచ్చి అంబులెన్స్‌ ద్వారా తిరుమలలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. లక్ష్మీసాయి సంతోషికి చిన్నతనం నుంచే శ్వాస సంబంధిత సమస్య ఉందని, క్యూలైన్‌లో దర్శనానికి వెళ్లే సమయంలోనే అలసటగా కనిపించిందని పోలీసు విచారణలో వారు తెలిపారు. తమకు ఎలాంటి అనుమానాలూ లేవని, కేసు వద్దని యువతి కుటుంబ సభ్యులు చెప్పడంతో మృతదేహాన్ని రాత్రి 7గంటలకు విజయవాడకు పంపారు. కాగా, యువతి ఒంటిపై బంగారు ఆభరణాలు కనిపించకపోవడం కలకలం సృష్టించింది.

Updated Date - 2023-11-30T03:57:08+05:30 IST