Share News

‘శ్రీనివాసా’... గోవిందా!

ABN , First Publish Date - 2023-12-01T05:22:12+05:30 IST

చిత్తూరు జిల్లా పుత్తూరు ప్రాంతానికి చెందిన శ్రీనివాసరాజు కన్ఫర్డ్‌ ఐఏఎస్‌. ఆయన గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.

‘శ్రీనివాసా’... గోవిందా!

లాబీయింగ్‌ కోసం తిరుమల అధికారులు

అటు ధర్మారెడ్డి, ఇటు శ్రీనివాసరాజు

ఇద్దరినీ ఉపయోగించుకుంటున్న జగన్‌

అతనికంటే ఘనుడు.. శ్రీనివాసరాజు

కిరణ్‌ హయాంలో జేఈవోగా రాక

పరపతి పెంచుకుని పాతుకుపోయి..

జగన్‌రాగానే ధర్మారెడ్డికి పదవి

‘సకల కుశలోపరి’లాగా

తెలంగాణకు శ్రీనివాస రాజు

అసాధారణ రీతిలో డిప్యుటేషన్‌

హైదరాబాద్‌ చుట్టూ వివాదాల్లో ఆయన భూములు

ఆర్‌అండ్‌బీ కార్యదర్శిగా ఆర్‌ఆర్‌ఆర్‌ పర్యవేక్షణ

వైసీపీ, బీఆర్‌ఎస్‌ ముఖ్యుల భూములకు రక్షణ

ఢిల్లీలో జగన్‌, బీఆర్‌ఎస్‌ తరఫున లాబీయింగ్‌

ఆ విషయంలో ధర్మారెడ్డితోనూ సమన్వయం

అందరూ అందరినీ ‘మేనేజ్‌’ చేయలేరు! కొందరు రాజకీయ నాయకులను, ఇంకొందరు బ్యూరోక్రాట్లను, మరికొందరు న్యాయవ్యవస్థనూ మేనేజ్‌ చేయగలరు. కానీ... అందరినీ మేనేజ్‌ చేసే శక్తి ఒక్కరికే ఉంది! అది... తిరుమల తిరుపతి దేవస్థానం సర్వాధికారికి! ఆ విషయాన్ని గ్రహించే... ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తనవాడైన ధర్మారెడ్డికి టీటీడీలో సకల బాధ్యతలు అప్పగించారు. ధర్మారెడ్డికంటే ముందు టీటీడీలో జేఈవోగా చక్రం తిప్పిన శ్రీనివాసరాజునూ తన సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. ‘అతనికంటే ఘనుడు’ అన్నట్లుగా శ్రీనివాసరాజు ఇటు ఏపీ, అటు తెలంగాణ ముఖ్య నేతల రాజకీయ అవసరాలకు ఉపయోగపడుతుండటం విశేషం! దేవుడిని సైతం తమ అవసరాలకు వాడుకోవడం ఇప్పటిలాగా మరెప్పుడూ లేదు. అందుకు నిదర్శనమే... ధర్మారెడ్డి, శ్రీనివాసరాజు!

(అమరావతి - ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా పుత్తూరు ప్రాంతానికి చెందిన శ్రీనివాసరాజు కన్ఫర్డ్‌ ఐఏఎస్‌. ఆయన గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే... ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి కుటుంబానికీ, శ్రీనివాసరాజు కుటుంబానికీ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో... కిరణ్‌ ఆయనను ఏరికోరి టీటీడీ జేఈవోగా నియమించారు. అక్కడి నుంచే ఆయన హవా మొదలైంది. కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలో ఆయన రెండేళ్లు మాత్రమే జేఈవోగా పని చేశారు. ఆ స్వల్పకాలంలోనే టీటీడీని, వెంకటేశ్వరస్వామిని ఉపయోగించుకుని ఢిల్లీ దాకా తన పరపతి పెంచుకున్నారు. రాష్ట్రవిభజన తర్వాత నవ్యాంధ్రకు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం మారగానే ముఖ్యమైన స్థానాల్లోని అధికారులనూ మార్చడం సహజం. అలాగే... టీటీడీ జేఈవోగా ఉన్న శ్రీనివాస రాజును కూడా మార్చాలని భావించారు. కానీ... ఢిల్లీ స్థాయి ఒత్తిళ్లు బలంగా పని చేయడంతో అది కుదరలేదు. చంద్రబాబు సీఎంగా ఉన్న ఐదేళ్లూ ఆయనే జేఈవోగా ఉన్నారు. ఈ సమయంలో నిశ్శబ్దంగా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. అటు ఢిల్లీ, ఇటు తెలంగాణలో తన పరపతి పెంచుకున్నారు. తెలంగాణ నుంచి అధికార బీఆర్‌ఎస్‌ నేతలు, మంత్రులు ఎవరు తిరుమల వచ్చినా రాచమర్యాదలు లభించేవి. తెలంగాణపై శ్రీనివాసరాజుకు ప్రత్యేక ఆసక్తికి ఒక కారణం ఉంది! ఆయన మరో అధికారిణితో కలిసి హైదరాబాద్‌ చుట్టుపక్కల భూములు కొన్నారు. వాటిలో చాలావరకు కబ్జాకు గురయ్యాయి. వాటిని తిరిగి సొంతం చేసుకునేందుకు తరచూ హైదరాబాద్‌ వెళ్లి ప్రయత్నాలు సాగించేవారు. అక్కడి రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా తిరుమలలో రెడ్‌ కార్పెట్‌ పరిచి... భూ వివాదాల పరిష్కారం కోసం ప్రయత్నించేవారని అధికార వర్గాల్లో ప్రచారం జరిగింది..

జగన్‌ రాగానే జరిగింది ఇదీ...

2019లో జగన్‌ సీఎం కాగానే చంద్రబాబు హయాంలో సీఎంపేషీలో ఉన్న అధికారులతోపాటు కీలక స్థానాల్లో ఉన్న వారందరినీ మార్చేశారు. తిరుమలలో తనకు నూరు శాతం నమ్మకస్తుడైన అధికారి ఉండాలని భావించి... ఢిల్లీ నుంచి ధర్మారెడ్డిని తీసుకొచ్చారు. శ్రీనివాసరాజును టీటీడీ నుంచి తప్పించినప్పటికీ... అప్పటికే ఆయనకున్న పరపతిని దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తనకు, తెలంగాణ సర్కారు పెద్దలకు, శ్రీనివాసరాజుకూ... అందరికీ ‘ఉపయోగపడేలా’ ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే... శ్రీనివాసరాజును డిప్యుటేషన్‌పై తెలంగాణకు పంప డం! ఆయనకు తెలంగాణతోపాటు, ఢిల్లీలో ఉన్న పరిచయాలను తనకోసం వాడుకోవచ్చునన్నది జగన్‌ ఆలోచన! తెలంగాణలో కుదురుకుని తన భూముల వివాదాలు పరిష్కరించుకోవడం శ్రీనివాసరాజు లక్ష్యం! ‘మీకూ, మాకూ ఉపయోగపడతారు’ అంటూ శ్రీనివాసరాజు డిప్యుటేషన్‌కు జగన్‌ కేసీఆర్‌ను ఒప్పించారు.

అసాధారణ పరిణామం...

అఖిల భారత సర్వీసు అధికారులు తమ మొత్తం సర్వీసులో ఐదేళ్లపాటు సొంత రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై రావొచ్చు. అందులోనూ... ఒకే విడతలో మూడేళ్లకు మించి పని చేయకూడదు. శ్రీనివాసరాజు కన్ఫర్డ్‌ ఐఏఎస్‌. అచ్చంగా ఏపీకి చెందిన, ఏపీ కేడర్‌ అధికారి. మరి... ఆయనను పొరుగు రాష్ట్రానికి పంపడం ఎలా సాధ్యం? జగన్‌ అనుకుని, కేంద్రం కరుణిస్తే ఏదైనా సాధ్యమే! మోదీని ఒప్పించి, నిబంధనలను సడలించి మరీ శ్రీనివాసరాజును తెలంగాణకు డిప్యుటేషన్‌ మీద పంపించారు. మూడేళ్ల కాలం ముగిశాక... డిప్యుటేషన్‌ పొడిగించేందుకు కేంద్రం నిరాకరించింది. ‘మిమ్మల్ని తెలంగాణకు పంపించడమే అసాధారణ నిర్ణయం. పొడిగింపు అసాధ్యం’ అని స్పష్టం చేసింది. అయినా సరే... శ్రీనివాసరాజు ఏపీకి రాలేదు. క్యాట్‌కు వెళ్లి తనకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. డిప్యుటేషన్‌ గడువు ముగిశాక ‘క్యాట్‌’ ఉత్తర్వులు వచ్చేందుకు రెండు నెలలు పట్టింది. ఆ రెండు నెలలూ ఆయన ‘అనధికారికం’గా తెలంగాణలో కొనసాగారు. ఆయన తొలుత తెలంగాణలో చిన్న చిన్న శాఖల్లో పని చేశాక ఆర్‌అండ్‌బీ సెక్రటరీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన రీజనల్‌ రింగ్‌ రోడ్డుకు ఆయనే ఇన్‌చార్జి. భూసేకరణ ఆయన పర్యవేక్షణలోనే జరుగుతోంది. ఈ క్రమంలో జగన్‌ వర్గీయులతోపాటు బీఆర్‌ఎస్‌ ముఖ్యుల భూములు పోకుండా కాపాడేలా ‘స్కెచ్‌’ గీస్తున్నట్లు తెలిసింది.

ఢిల్లీలో అక్కడే మకాం...

జగన్‌ తరఫున ఎప్పుడు అవసరమైతే అప్పుడు శ్రీనివాసరాజు ‘లాబీయింగ్‌’కు దిగుతారనే ఆరోపణలున్నాయి. దీనికోసం ఆయన నేరుగా ఢిల్లీకి వెళ్లి కూర్చుంటారు. ఏపీలో భారీ ప్రాజెక్టులు నిర్వహిస్తున్న ఒక పారిశ్రామిక వేత్త లీజుకు తీసుకున్న భవనంలోనే బస చేస్తారు. ఆయన లాబీయింగ్‌కు అదే అడ్డా! జగన్‌కు అవసరమైన పనులు పూర్తి చేయడంలో శ్రీనివాసరాజు, ధర్మారెడ్డి మధ్య పూర్తి సమన్వయం కనిపిస్తుంది. వీరిద్దరి ఉమ్మడి లింకు ఒక్కటే! అది... తిరుమల!

Updated Date - 2023-12-01T05:22:14+05:30 IST