Share News

YSRCP : ‘కుల’కలం.. సడన్‌గా ఎందుకులా జగన్..?

ABN , First Publish Date - 2023-10-29T06:39:56+05:30 IST

అధికారంలోకి వచ్చీ రాగానే.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రత్యేకంగా ఉన్న పథకాలన్నీ ఎత్తేశారు. అందరికీ వర్తించే పథకాల్లోనే వారి లబ్ధిని వెతుక్కోమని చెప్పేశారు. బీసీ కులాల్లో పేరుకొకటి చొప్పున ఉత్తుత్తి కార్పొరేషన్లు పెట్టారు. వాటికి నిధులూ లేవు. విధులూ లేవు. రాష్ట్ర ప్రజలందరికీ వర్తించే పథకాలనే ఆయా కార్పొరేషన్ల ద్వారా అమలు చేసినట్లుగా బిల్డప్‌ ఇచ్చారు...

YSRCP : ‘కుల’కలం.. సడన్‌గా ఎందుకులా జగన్..?

అధికారంలోకి వచ్చీ రాగానే.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రత్యేకంగా ఉన్న పథకాలన్నీ ఎత్తేశారు. అందరికీ వర్తించే పథకాల్లోనే వారి లబ్ధిని వెతుక్కోమని చెప్పేశారు. బీసీ కులాల్లో పేరుకొకటి చొప్పున ఉత్తుత్తి కార్పొరేషన్లు పెట్టారు. వాటికి నిధులూ లేవు. విధులూ లేవు. రాష్ట్ర ప్రజలందరికీ వర్తించే పథకాలనే ఆయా కార్పొరేషన్ల ద్వారా అమలు చేసినట్లుగా బిల్డప్‌ ఇచ్చారు.

ఎన్నికలు రాగానే... ‘సామాజిక సాధికార యాత్ర’ అంటూ బస్సుల్లో బయలుదేరారు. అంతేకాదు.. కులగణన పేరుతో మరోసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను మభ్యపెట్టే కార్యక్రమం కూడా మొదలుపెట్టారు.


  • ఎన్నికల వేళ సంఘాలపై వల!

  • కుల గణనలో రాజకీయ కోణమే

  • నాలుగున్నరేళ్లుగా బడుగుల అణచివేత

  • గళమెత్తితే ఎక్కడికక్కడ నిర్బంధం

  • ఎన్నికలు దగ్గర పడడంతోదువ్వేందుకు కసరత్తు

  • ఇటీవల ప్రభుత్వ ప్రోద్బలంతో..

  • ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ ఏర్పాటు

  • డిమాండ్లు పరిష్కరిస్తామంటూ హామీలు

  • తాజాగా వచ్చే నెల 15 నుంచి కులగణన చేపడతామని ప్రకటన

(అమరావతి - ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమాన్ని కాగితాలకే పరిమితం చేసిన జగన్‌ ప్రభుత్వానికి.. నాలుగేళ్ల తర్వాత హఠాత్తుగా ఆ వర్గాలు గుర్తుకొచ్చాయి. ఇన్నాళ్లూ కుల సంఘాలు గళమెత్తకుండా తీవ్ర అణచివేత ధోరణితో వ్యవహరించి.. ఇప్పుడు వాటికి ఎరవేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేవలం రాజకీయ లబ్ధిని దృష్టిలో పెట్టుకుని కుల గణనకు రంగం సిద్ధం చేసింది. వచ్చే నెల 15 నుంచి కులగణన చేపడుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించిన పలు సమస్యలపై ఆయా కుల సంఘాలు ధర్నాలు చేస్తున్నాయి. గత ప్రభుత్వం అమలు చేసిన ఒక్కో పథకాన్ని జగన్‌ సర్కారు రద్దు చేసినప్పుడల్లా నిరసనలకు దిగుతున్నాయి. సీఎం జగన్‌ నివాసం ఉండే తాడేపల్లికి వచ్చి నిరసన తెలియజేయాలని ప్రయత్నిస్తే పోలీసులను దించి అణచివేస్తున్నారు. నర్సీపట్నం వైద్యుడు డాక్టర్‌ సుధాకర్‌ ఉదంతం నుంచి రాష్ట్రంలో నెలకొన్న పలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ్యతిరేక చర్యలపై ఆయా కుల సంఘాలు ఉద్యమిస్తూనే ఉన్నాయి. అయితే సర్కారు ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపడంతో వెలుగులోకి రాలేదు. దీంతో ప్రజాసంఘాలు, కులసంఘాలు వైసీపీపై మండిపడుతున్నాయి. ఎన్నికలొస్తే సత్తా చూపాలన్న కసి వాటిలో కనిపిస్తోంది. పలు సంఘాల నేతలు బాహాటంగానే విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు తమకు రాజ్యాంగబద్ధంగా అందాల్సిన పథకాలు, నిధుల కోసం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ మంత్రులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదు. అందుకే గ్రామాల్లో ఎమ్మెల్యేలు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంతో వెళ్లినప్పుడల్లా ఆయా సంఘాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

బుజ్జగించేందుకే ‘గణన’

కులాల వారీగా జనాభాపై ఇప్పటిదాకా అంచనాలు మాత్రమే ఉన్నాయి. నిర్దిష్టమైన లెక్కలు లేవు. కుల గణన చేపట్టి దాని ప్రకారం తమకు నిధులు కేటాయించాలని బీసీ కులాల నుంచి ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. కానీ... నాలుగున్నరేళ్లలో జగన్‌ సర్కారు ఎప్పుడూ దీని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ముంగిట జగన్‌ ప్రభుత్వం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాజకీయ ప్రయోజనాల కోసమే కులగణన చేపడతామని ప్రకటించింది. వాస్తవానికి కులగణన కోసం వివిధ శాఖల కార్యదర్శులతో మే నెలలోనే ఓ రాష్ట్ర స్థాయి కమిటీని వేసి అధ్యయనం పూర్తి చేసినట్లు మమ అనిపించారు. ఇప్పుడు వచ్చే నెల 15వ తేదీ నుంచి కులగణన చేపడుతున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆర్భాటంగా ప్రకటించారు. నెలరోజుల్లోనే దీనిని పూర్తి చేయాలని భావిస్తున్నారు. కీలకమైన ప్రక్రియను ఇంత హడావుడిగా చేస్తే సరైన ఫలితాలు వచ్చే అవకాశం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది.

మాజీ అధికారుల ప్రయోగం..

ఎన్నికల ఏడాదిలో కుల సంఘాలను మచ్చిక చేసుకోవడానికి కొందరు మాజీ అధికారులను, రిటైర్డ్‌ న్యాయమూర్తులను రంగంలోకి దించారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ విజయ్‌కుమార్‌ ఆయా కులసంఘాలను వైసీపీకి అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయనతో పాటు తెలంగాణకు చెందిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య, రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ వి.ఈశ్వరయ్య కూడా అదే పనిలో ఉన్నారు. ఇటీవల తాడేపల్లిలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు సమావేశమై జేఏసీ ఏర్పాటు చేసుకున్నాయి. నాలుగేళ్ల పాటు ఈ సంఘాలను దగ్గరకు రానివ్వని ప్రభుత్వం.. కొందరు అధికారుల ఆధ్వర్యంలో ఈ జేఏసీ ఏర్పాటుకు దన్నుగా నిలవడం గమనార్హం.

ఏమడిగినా ఓకే!

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలు ఇప్పుడు ఏమడిగినా నెరవేరుస్తామని ప్రభుత్వం హామీలు గుప్పిస్తోంది. ఆయా కుల సంఘాలతో సమావేశాలు ఏర్పాటుచేసి వారిని ప్రసన్నం చేసుకోవాలని చూస్తోంది. అయితే గత ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలనే నెరవేర్చని జగన్‌.. ఇప్పుడిచ్చే హామీలను నెరవేర్చడం అనుమానమేనని సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. సమస్యల పరిష్కారానికి జారీచేసిన జీవోలు కాగితాలకే పరిమితమయ్యాయని.. ఇప్పుడిచ్చిన హామీలదీ అదే పరిస్థితి అని చెబుతున్నారు.

Updated Date - 2023-10-29T06:39:56+05:30 IST