Share News

తుది దశకు టెస్లాతో ఒప్పందం!

ABN , First Publish Date - 2023-11-22T01:27:36+05:30 IST

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ టెస్లాతో భారత ప్రభుత్వం త్వరలోనే ఒప్పందాన్ని ఖరారు చేసుకోనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. టెస్లా తొలుత...

తుది దశకు టెస్లాతో ఒప్పందం!

వచ్చే ఏడాది నుంచి భారత్‌లోకి కంపెనీ కార్ల దిగుమతి

రెండేళ్లలో ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్న సంస్థ వచ్చే జనవరిలో

గుజరాత్‌ వైబ్రంట్‌ సమ్మిట్‌లో అగ్రిమెంట్‌!

న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ టెస్లాతో భారత ప్రభుత్వం త్వరలోనే ఒప్పందాన్ని ఖరారు చేసుకోనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. టెస్లా తొలుత తన కార్లను భారత్‌లోకి దిగుమతి చేసుకుని విక్రయించేందుకు ఈ అగ్రిమెంట్‌ అనుమతించనుందని.. రెండేళ్లలోనే కంపెనీ భారత్‌లోనే కార్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుందని వారన్నారు. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న గుజరాత్‌ వైబ్రంట్‌ సమ్మిట్‌లో ఈ ఒప్పందం ఖరారు కావచ్చని ఒకరన్నారు. భారత్‌లో ప్లాంట్‌ కోసం టెస్లా 200 కోట్ల డాలర్ల (రూ.16,600 కోట్లు) వరకు పెట్టుబడి పెట్టవచ్చన్నారు. ఈ ప్లాంట్‌ ఏర్పాటునకు కంపెనీ ఆటో రంగ తయారీ హబ్‌లుగా ఉన్న గుజరాత్‌, తమిళనాడు లేదా మహారాష్ట్రల్లో ఒక రాష్ట్రాన్ని ఎంచుకోవచ్చన్నారు. కాగా ఈ నెలలో అమెరికాలో పర్యటించిన సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ కాలిఫోర్నియా, ఫ్రెమాంట్‌లోని టెస్లా కార్ల తయారీ ప్లాంట్‌ను సైతం సందర్శించారు. .ప్రపంచంలో అతిపెద్ద ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ కంపెనీ అయిన టెస్లా.. భారత్‌ నుంచి వాహనాల విడిభాగాల దిగుమతులను రెట్టింపు చేయనున్నట్లు ఆయన ఆ సందర్భంగా తెలిపారు. భారత్‌లోనే కార్ల తయారీ ప్రారంభించే ముందు వాటిని దిగుమతి చేసుకునేందుకు అనుమతించాలని కేంద్రాన్ని టెస్లా కోరినట్లు తెలిసింది.

Updated Date - 2023-11-22T01:27:41+05:30 IST