Cipla : సిప్లాపై బ్లాక్‌స్టోన్‌ కన్ను!

ABN , First Publish Date - 2023-08-05T04:12:47+05:30 IST

దేశంలోని మూడో అతిపెద్ద ఔషధాల తయారీ కంపెనీ సిప్లాను టేకోవర్‌ చేసేందుకు అమెరికన్‌ ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ ఫార్మా కంపెనీలో

Cipla : సిప్లాపై బ్లాక్‌స్టోన్‌ కన్ను!

ప్రమోటర్లకు చెందిన 33.47% వాటా కొనుగోలుకు అమెరికన్‌ ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం ప్రయత్నాలు!!

వచ్చే వారంలో బిడ్‌ సమర్పించే అవకాశం

న్యూఢిల్లీ: దేశంలోని మూడో అతిపెద్ద ఔషధాల తయారీ కంపెనీ సిప్లాను టేకోవర్‌ చేసేందుకు అమెరికన్‌ ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ ఫార్మా కంపెనీలో ప్రమోటర్లకు చెందిన 33.47 శాతం వాటా కొనుగోలుకు వచ్చే వారంలో బ్లాక్‌స్టోన్‌ నాన్‌ బైండింగ్‌ (విధిగా కట్టుబడి ఉండాల్సిన అవసరం లేని) బిడ్‌ను సమర్పించే అవకాశం ఉంది. ఒకవేళ బ్లాక్‌స్టోన్‌ ప్రయత్నాలు ఫలిస్తే, సిప్లా ప్రమోటర్లైన హమీద్‌ కుటుంబం కంపెనీ నుంచి పూర్తిగా వైదొలిగినట్లు అవుతుంది. అంతేకాదు, సెబీ నిబంధనల ప్రకారం బహిరంగ మార్కె ట్‌ నుంచి కంపెనీ పబ్లిక్‌ షేర్‌హోల్డర్ల నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకు బ్లాక్‌స్టోన్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించాల్సి ఉంటుంది. తద్వారా సిప్లాలో మొత్తం 59.4 శాతం వాటాతో బ్లాక్‌స్టోన్‌ మెజారిటీ వాటాదారుగా అవతరించేందుకు అవకాశం ఉంది. అయితే, ఇందుకు సంబంధించి ఇరువర్గాలు ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది. ఈ ఊహాగానాల నేపథ్యంలో బీఎ్‌సఈలో సిప్లా షేరు శుక్రవారం 3.82 శాతం పెరిగి రూ.1,209.55 వద్ద ముగిసింది.

1935లో ప్రారంభం

దేశానికి స్వాతంత్య్రం రాకముందు, 1935లో ప్రారంభమైన సిప్లా.. దేశంలో పురాతన ఫార్మా కంపెనీ. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ పటేల్‌ వంటి స్వాతంత్య్ర సమరయోధుల అడుగుజాడల్లో నడిచిన ఖ్వాజా అబ్దుల్‌ హమీద్‌ ఈ కంపెనీని ప్రారంభించారు. ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ కంపెనీకి అబ్దుల్‌ హమీద్‌ కుమారుడు యూసుఫ్‌ హమీద్‌ ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్నారు. అమెరికా, జర్మనీ, బ్రిటన్‌ ఫార్మా దిగ్గజాల గుత్తాధిపత్యానికి చెక్‌ పెడుతూ దేశీయంగా, అంతర్జాతీయంగా చౌకగా జెనరిక్‌ ఔషధాలను సరఫరా చేసే కంపెనీగా సిప్లాను తీర్చిదిద్దడంలో యూసుఫ్‌ హమీద్‌ ప్రధాన పాత్ర పోషించారు. ఆయన బాటను అనుసరిస్తూ, దేశంలోని ఇతర జెనరిక్‌ ఔషధాల కంపెనీలు కూడా అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరించాయి.

దేశంలోని పురాతన ఔషధ కంపెనీల్లో ఒకటైన సిప్లాను కొనుగోలు చేసేందుకు అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ కంపెనీ బ్లాక్‌స్టోన్‌ బేరసారాలు జరుపుతున్నదన్న వార్తలు బాధ కలిగించాయి. భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక చరిత్రలో సిప్లా కూడా ఒక భాగం. అలాంటి సంస్థను బ్లాక్‌స్టోన్‌ టేకోవర్‌ చేయనుండటం మనందరనీ బాధపెట్టే విషయం.

- జైరాం రమేశ్‌ ,కాంగ్రెస్‌ నేత

Updated Date - 2023-08-05T04:12:47+05:30 IST