RBI: దేశవ్యాప్తంగా అన్ని షాపులకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక సూచన

ABN , First Publish Date - 2023-05-22T17:24:29+05:30 IST

రెండు వేల రూపాయల నోటు ఉపసంహరణపై (Rs 2000 notes withdrawal) అసత్యాలు ప్రచారమవుతున్న వేళ కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) కీలక ప్రకటన చేసింది.

RBI: దేశవ్యాప్తంగా అన్ని షాపులకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక సూచన

ముంబై: రెండు వేల రూపాయల నోటు ఉపసంహరణపై (Rs 2000 notes withdrawal) అసత్యాలు ప్రచారమవుతున్న వేళ కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) కీలక ప్రకటన చేసింది. షాపులు రూ.2000 నోటును తిరస్కరించకూడదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ (Shakthikanth Das) సూచించారు. ఈ పెద్ద నోటును చెలామణీ నుంచి ఉపసంహరించినప్పటికీ చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆర్బీఐ గత ఆదేశాలానుసారం రూ.2 వేల నోటును ఎవరూ తిరస్కరించకూడదని తెలిపారు. దేశవ్యాప్తంగా దుకాణాలన్నింటికీ ఇదే సూచన వర్తిస్తుందని ఆయన చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

రూ.2,000 నోట్లను ఉపసంహరించుకున్న నేపథ్యంలో కొత్తగా రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టనున్నారా అనే ప్రశ్నకు స్పందించారు. రూ.1,000 నోట్లు తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెట్టాలనే ఆలోచన ప్రస్తుతానికి ఏదీ తమవద్ద లేదని చెప్పారు. రూ.2 వేల నోట్ల మార్పిడికి అవసరమైన ఇతర డినామినేషన్ నోట్లు తగినన్ని ఉన్నాయని, రూ.500 నోట్లను అవసరాన్ని బట్టి ప్రింట్ చేస్తామని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. రూ.2 వేల నోట్ల మార్పిడికి అవసరమైన కరెన్సీని అందుబాటులో ఉంచుకోవాలని ఇప్పటికే అన్ని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. కాగా, ప్రస్తుతం రూ.181 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు సర్క్యులేషన్‌లో ఉన్నట్టు ఆర్బీఐ చెబుతోంది. నోట్ల మార్పిడి, డిపాజిట్లు చేసుకునేందుకు నాలుగు నెలలు గడువు ఉన్నందున ఎవరూ బ్యాంకుల ముందు పడిగాపులు పడనవసరం లేదని, ప్రజలు దీన్ని సీరియస్‌గా తీసుకుని రూ.2 వేల నోట్లన్నీ వాపస్ చేస్తారనే అనుకుంటున్నట్టు శక్తికాంత దాస్ తెలిపారు. అవసరాన్ని బట్టి సెప్టెంబర్ 30 తర్వాత గడువు పొడిగించే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

Updated Date - 2023-05-22T17:24:29+05:30 IST