5 రాష్ట్రాల ఎన్నికల వాయిదాకే

ABN , First Publish Date - 2023-09-12T02:27:50+05:30 IST

కేంద్రం పెద్ద వ్యూహంతోనే ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ అంటూ ప్రచారానికి తెర తీసిందని సుప్రీం కోర్టు న్యాయవాది, సామాజిక కార్యకర్త ప్రశాంత్‌ భూషణ్‌ అన్నారు...

5 రాష్ట్రాల ఎన్నికల వాయిదాకే

జమిలి వ్యూహం!

భువనేశ్వర్‌, సెప్టెంబరు 11: కేంద్రం పెద్ద వ్యూహంతోనే ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ అంటూ ప్రచారానికి తెర తీసిందని సుప్రీం కోర్టు న్యాయవాది, సామాజిక కార్యకర్త ప్రశాంత్‌ భూషణ్‌ అన్నారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేసేందుకే జమిలి ఎన్నికల అంశాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. ఈ ఏడాది చివర్లోనే తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరం, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల అసెంబ్లీ జరగనున్నాయని తెలిపారు. ‘‘భారత్‌ వంటి ప్రజాస్వామ్య దేశాల్లో ఒకేసారి ఎన్నికలను నిర్వహించకూడదు. ఎందుకంటే మన వ్యవస్థలో ఓ ప్రభుత్వం మధ్యలోనే మెజారిటీని కోల్పోతే కుప్పకూలుతుంది. అటువంటప్పుడు జమిలీ నిర్వహించి ఏం లాభం.. అలాగే ఏకకాలంలో జమిలీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే అప్పుడు దేశంలో కచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించాలి. అది ప్రజాస్వామ్యానికే విరుద్ధం. ఈ వాస్తవాలన్నీ ప్రభుత్వానికి కూడా తెలుసు. ఈ ప్రభుత్వానికి ప్రస్తుతం రాజ్యసభలో మెజారిటీ లేదు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోతామని బీజేపీకి భయం పట్టుకుంది. అందుకే ‘ఒకే ఎన్నిక’ పేరిట సార్వత్రిక ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని చూస్తున్నారు. అప్పుడు ఆయా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుంది’’ అన్నారు. అయితే, అసెంబ్లీ ఎలక్షన్లు జరగనున్న అయిదు రాష్ట్రాల్లో జరపాల్సిన పర్యటనలను ఎన్నికల కమిషనర్లు అక్టోబరు మొదటి వారంలోగా పూర్తి చేయనున్నారు. ఆ తరువాత ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని సోమవారం విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఎన్నికల కమిషనర్లు ఛత్తీ్‌సగఢ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరాంలో పర్యటించి ఎన్నికల సన్నద్ధతపై అంచనా వేశారు. ఈ నెలాఖరు, వచ్చే నెల మొదటి వారాల్లో మిగిలిన రెండు రాష్ట్రాలైన రాజస్థాన్‌, తెలంగాణల్లో పర్యటించనున్నారు.

Updated Date - 2023-09-12T02:27:50+05:30 IST