Chandrayaan-3: చంద్రునిపై ముద్రించబడని అశోక చిహ్నం.. శుభమే అంటున్న ఇస్రో శాస్త్రవేత్తలు.. ఎందుకంటే?

ABN , First Publish Date - 2023-09-24T18:31:07+05:30 IST

చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు జరిపి భూమికి ఎంతో ముఖ్యమైన సమాచారం అందజేసిన ప్రజ్ఞాన్ రోవర్‌కి ఒక ప్రత్యేకత ఉంది. దీని చక్రాలపై అశోక చిహ్నం (మూడు సింహాలు), ఇస్రో లోగోను..

Chandrayaan-3: చంద్రునిపై ముద్రించబడని అశోక చిహ్నం.. శుభమే అంటున్న ఇస్రో శాస్త్రవేత్తలు.. ఎందుకంటే?

చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు జరిపి భూమికి ఎంతో ముఖ్యమైన సమాచారం అందజేసిన ప్రజ్ఞాన్ రోవర్‌కి ఒక ప్రత్యేకత ఉంది. దీని చక్రాలపై అశోక చిహ్నం (మూడు సింహాలు), ఇస్రో లోగోను ముద్రించారు. ఈ రోవర్ నడిచినప్పుడు.. చంద్రుని ఉపరితలంపై ఆ చిహ్నాల ముద్ర నిలిచిపోయేలా శాస్తవేత్తలు అలా డిజైన్ చేశారు. కానీ.. ప్రజ్ఞాన్ రోవర్ స్పష్టంగా వాటిని చంద్రునిపై ముద్రించలేకపోయింది. అయితే.. ఇది ఆందోళన కలిగించే విషయం కాదని, మంచి పరిణామమేనని ఇస్రో పేర్కొంది. దీని వల్ల.. చంద్రుని దక్షిణ ధ్రువంలోని నేల గురించి కొత్త అవగాహన కలిగిందని ఇస్రో తెలిపింది.

ఈ విషయంపై ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ.. ‘‘చంద్రుని ఉపరితలంపై అశోక చిహ్నం, లోగో గుర్తులు అస్పష్టంగా ముద్రించబడటం.. సరికొత్త అవగాహనను ఇచ్చాయి. దక్షిణ ధ్రువంలోని నేల పూర్తిగా భిన్నమైనదని మాకు ముందే తెలుసు. అయితే.. ఇది ఎందుకు భిన్నమైనదో మేమిప్పుడు తెలుసుకోవాలి’’ అని అన్నారు. నిజానికి.. చంద్రుని దక్షిణ ధృవం.. అనేక భవిష్యత్ మిషన్ల లక్ష్యం. మట్టికి సంబంధించిన ఈ ఆవిష్కరణ.. చంద్రునిపై స్థావరాన్ని స్థాపించడానికి ముఖ్యమైనదని నిరూపించడానికి వీలుంటుంది. శివశక్తి పాయింట్ దగ్గర చంద్రుడి నేల గట్టిగా ఉంటుంది. అది అలా గట్టిగా ఉండటానికి గల కారణాలేంటో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.


ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఇంకా మాట్లాడుతూ.. ఎక్కడైతే ప్రజ్ఞాన్ రోవర్ నడిచిందో, అక్కడ మట్టి ముద్దగా ఉందన్నారు. దీనర్థం.. ఆ మట్టిని ఏదో బంధిస్తోందని అర్థం చేసుకోవచ్చని అన్నారు. అయితే.. మట్టిని బంధిస్తున్న ఈ వస్తువు ఏందో అధ్యయనం చేయాలన్నారు. ఇది ‘లూనార్ సాయిల్ సిమ్యులెంట్’ (LSS) ద్వారా భూమిపై పరీక్షించబడిందన్నారు. కాగా.. అమెరికాకు చెందిన అపోలో మిషన్ల ద్వారా.. చంద్రునిపై సేకరించిన మట్టి నమూనాలను సరిపోల్చడానికి LSS రూపొందించబడింది. అపోలో మిషన్లు చంద్రుని భూమధ్యరేఖకు సమీపంలో ల్యాండ్ అయ్యాయి.

ఇదిలావుండగా.. 2023 ఆగస్టు 23వ తేదీన భారతదేశం సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్ చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయి.. చంద్రుడిపైకి వెళ్లిన నాలుగో దేశంగా నిలిచింది. అంతేకాదు.. దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి దేశంగానూ భారత్ అవతరించింది. చంద్రునిపై ఈ మిషన్ కాలుమోపిన తర్వాత.. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు తమ పరిశోధనలు జరిపి ఎంతో సమాచారాన్ని భూమికి పంపించాయి.

Updated Date - 2023-09-24T18:31:28+05:30 IST