Odisha Train Accident: రైల్వే మంత్రికి బాసటగా మాజీ ప్రధాని

ABN , First Publish Date - 2023-06-06T16:21:40+05:30 IST

ఒడిశా ఘోర రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్‌తో మాజీ ప్రధాన మంత్రి, జనతాదళ్ సెక్యులర్ చీఫ్ హెచ్‌డీ దేవెగౌడ విభేదించారు. ఇలాంటి సమయంలో విపక్షాల డిమాండ్ తెలివైన పని కాదని అన్నారు.

Odisha Train Accident: రైల్వే మంత్రికి బాసటగా మాజీ ప్రధాని

న్యూఢిల్లీ: ఒడిశా ఘోర రైలు ప్రమాదానికి (Odisha Rail accident) బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) రాజీనామా చేయాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్‌తో మాజీ ప్రధాన మంత్రి, జనతాదళ్ సెక్యులర్ (JDS) చీఫ్ హెచ్‌డీ దేవెగౌడ (HD Deve Gowda) విభేదించారు. ఇలాంటి సమయంలో విపక్షాల డిమాండ్ తెలివైన పని కాదని అన్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి రైల్వే మంత్రి అక్కడే ఉండి అవిశ్రాంతంగా కష్టపడ్డారని ప్రశంసించారు.

''ప్రమాదం తరువాత పరిస్థితిని చక్కదిద్దేందుకు రైల్వే మంత్రి చేయాల్సినదంతా చేశారు. అవిశ్రాంతంగా కష్టపడ్డారు. 55 గంటలుగా ఆయన శ్రమించడం నేను చూశాను. ముందు దర్యాప్తు పూర్తికానీయండి. రైల్వే మంత్రిగా ఆయన ఎంతవరకూ చేయగలరో అంతా చేశారు. ఈ సమయంలో ఆయనను రాజీనామా చేయమని డిమాండ్ చేయడం ఏమాత్రం తెలివైన పని కాదు'' అని దేవెగౌడ అన్నారు. ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు గురించి అడిగినప్పుడు, దానిపై తాను వ్యాఖ్యానించదలచుకోలేదని అన్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ఒక స్టాండ్ తీసుకున్నారని, అయితే దీనివెనుక రాజకీయంగా దాడి చేసే ఉద్దేశాలు ఉండకూడదన్నదే తన అభిప్రాయమని చెప్పారు. కాగా, ఒడిశా రైలు ఘటనను సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని రైల్వే శాఖ చేసిన ప్రతిపాదనతో కాంగ్రెస్ పార్టీ విభేదించింది. నేరాలపై విచారణకే సీబీఐ అనీ, రైలు ప్రమాదలపై విచారణకు కాదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తప్పుపట్టారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు.

Updated Date - 2023-06-06T16:21:40+05:30 IST