ఆంజనేయుడు పంచముఖుడు ఎలా అయ్యాడు? ఆ ముఖాల విశిష్టత ఏమిటి?

ABN , First Publish Date - 2023-10-06T01:19:35+05:30 IST

హనుమంతుడు పంచముఖాల గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. రామ-రావణ యుద్ధం జరుగుతున్నప్పుడు రాక్షస వీరులందరూ మరణిస్తూ ఉండడంతో... తన మేనమామ అయిన మైరావణుడి సాయాన్ని రావణుడు కోరుతాడు...

ఆంజనేయుడు పంచముఖుడు ఎలా అయ్యాడు? ఆ ముఖాల విశిష్టత ఏమిటి?

ధర్మసందేహం

హనుమంతుడు పంచముఖాల గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. రామ-రావణ యుద్ధం జరుగుతున్నప్పుడు రాక్షస వీరులందరూ మరణిస్తూ ఉండడంతో... తన మేనమామ అయిన మైరావణుడి సాయాన్ని రావణుడు కోరుతాడు. రామలక్ష్మణులను మాయావి అయిన మైరావణుడు అపహరించి, పాతాళలంకలో బంధిస్తాడు. వారిని విడిపించడానికి హనుమంతుడు పాతాళలంకకు వెళ్తాడు. మైరావణ నగరంలోని వివిధ దిక్కులలో ఉన్న అయిదు దీపాలను ఒకేసారి ఆర్పితేనే... మైరావణుణ్ణి చంపడం సాధ్యమని తెలుసుకుంటాడు. అయిదు ముఖాలతో ఆ అయిదు దీపాలనూ ఊది ఆర్పేస్తాడు. ఆ విధంగా మైరావణ వధ జరిగింది. ఆంజనేయుడు ధరించిన ఆ అయిదు ముఖాలు: తూర్పున తన సహజసిద్ధమైన వానర ముఖం, పశ్చిమాన గరుడ ముఖం, దక్షిణాన నృసింహ ముఖం. ఉత్తరాన వరాహ ముఖం, ఉర్ధ్వ దిశలో హయగ్రీవ ముఖం. ఇక... శివాంశ సంభూతుడైన హనుమంతుని పంచముఖాలను శివుని పంచముఖాలైన సద్యోజాత (వానర), అఘోర (గరుడ), తత్పురుష (వరాహ), వామదేవ (నారసింహ), ఈశాన (హయగ్రీవ) ముఖాలుగా కూడా వర్ణిస్తారు. వానర ముఖం అభీష్టసిద్ధిని, గరుడ రూపం దీర్ఘాయువును, వరాహ ముఖం ఐశ్వర్యాన్ని, నారసింహ ముఖం శత్రువులపై విజయాన్ని, హయగ్రీవ రూపం జ్ఞానాన్నీ, మోక్షాన్నీ కలుగజేస్తాయనేది భక్తుల విశ్వాసం.

Updated Date - 2023-10-06T01:19:35+05:30 IST