Jesus Christ: మానవుడైన మహనీయుడు

ABN , First Publish Date - 2023-05-05T02:49:51+05:30 IST

ఏసు క్రీస్తు స్వభావంపై అనేక రకాల సందేహాలు ఉన్నాయి. ‘ఆయన దేవుడి పుత్రుడేనా? కాదా?’ అనేది కొందరి సందేహం. ‘ఇంతకీ ఆయన ఎవరు?’ అనే ప్రశ్నకు ‘‘ఆయన ఒక పరిపూర్ణమైన మానవుడు. ఆయన దేవుడు కాదు’’ అనేది కొందరు చెప్పే సమాధానం.

Jesus Christ: మానవుడైన మహనీయుడు

సు క్రీస్తు స్వభావంపై అనేక రకాల సందేహాలు ఉన్నాయి. ‘ఆయన దేవుడి పుత్రుడేనా? కాదా?’ అనేది కొందరి సందేహం. ‘ఇంతకీ ఆయన ఎవరు?’ అనే ప్రశ్నకు ‘‘ఆయన ఒక పరిపూర్ణమైన మానవుడు. ఆయన దేవుడు కాదు’’ అనేది కొందరు చెప్పే సమాధానం. ఒకసారి తీక్షణంగా ఆలోచిద్దాం. మనం కేవలం మానవులం. ఒక మనిషికి తోడు ఎంతైనా అవసరం. దానికి మనిషే కావాలి. మామూలు మనిషికి ఏది కావాలో అది అందించాలంటే... అది మనిషికే తేలిక అవుతుంది. దానికి మాయలూ, మంత్రాలూ అవసరం లేదు. కనిపించని దివ్య శక్తులతో కూడా పని లేదు. అందుకే ప్రభువు సాధారణమైన మనిషిలా పుట్టాడు. మామూలు మనిషిగానే పెరిగాడు. సాదాసీదా వ్యక్తిలా మరణించాడు. కాబట్టి ఆయనను మానవుడే అని అనవచ్చు. అందులో తప్పేమీ లేదు.

ఒక మనిషి ఏ సందర్భంలో ఎలా ఉండాలో ఆయన ప్రబోధించాడు. ఎలా ప్రవర్తించాలో నేర్పించాడు. అవన్నీ చేసి చూపించాడు. బీదా బిక్కీ మొదలు విద్యావంతుల్నీ, సంపన్నుల్నీ... ఇలా ప్రతి ఒక్కరినీ చేరదీశాడు. ఎంతో గౌరవించాడు. ఇలాంటివన్నీ పరిశీలించాక... ఆయన మానవుడని నమ్మక తప్పదు. నలభై రోజులు ఉపవాసం ఉన్నాక... ఆయనకు ఆకలి వేసింది. ఆయన దేవుడైతే ఆకలి వేస్తుందా? రక్తాలు కారేలా కొట్టినప్పుడు... బాధలతో మరణించడమేమిటి? మాయలతో తప్పించుకోవచ్చు కదా! ఇవన్నీ చూస్తే ఆయన మనిషే కానీ దేవుడు కాదని అనిపిస్తుంది. బహుశా సాతానుకు కూడా అలాగే అనిపించి ఉంటుంది. ఇక్కడ ఆయన చీకటి బతుకులు చూశాడు. మూఢత్వంతో, అజ్ఞానంతో ప్రవర్తించేవాళ్ళని చూశాడు. ‘నేనే వెలుగు, నేనే మార్గం’ అన్నాడు. స్పష్టమైన అవగాహన కలిగించాడు. ‘నేనే జీవం’ అంటూ అవయవలోపం ఉన్నవారికి స్వస్థత చేకూర్చాడు. మరణించిన కొందరిని బతికించాడు కూడా. ఆయన కూడా మరణం నుంచి లేచి వచ్చాడు. ఇది ఎవరూ కాదనలేని సత్యం. తనమీద నమ్మకం ఉన్నట్టయితే... మరణించినా సజీవులుగానే ఉంటారని ప్రభువు ప్రకటించాడు. అది ఆయనలోని నిత్య జీవానికి చిహ్నం.

పాప భ్రష్టమైన సృష్టికి పునర్భాగ్యం కలిగించడానికి... ఆది తల్లితండ్రులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం... సృష్టికర్త ఆయనను భూమికి పంపించాడు. ఆ తండ్రి నిర్ణయం ప్రకారమే ప్రభువు జీవన ఘట్టాలన్నీ సాగాయి. ఆ కారణాల వల్ల ఆయనను దైవ కుమారుడిగా విశ్వసించక తప్పదు. ఒకవేళ... దీన్ని నమ్మినా, నమ్మకపోయినా... మనిషికి మార్గదర్శిగా ఉన్న ఆయన మహా పరిపూర్ణ మానవ స్వరూపాన్ని కొందరు నమ్మకపోవచ్చు. చీకటిని తొలగించే వెలుగును నమ్మలేకపోవడం అజ్ఞానమే. ఆ వెలుగుకు మన నమ్మికతో పని లేదు. మనం చీకటిలో ఉండాలనుకుంటే.. వెలుగుకు వచ్చే నష్టం లేదు. మహాజ్యోతిర్మయుడైన ఆ ప్రభువును మనలోనికి ఆహ్వానించుకోకపోతే... ఆ తప్పిదం ఎవరిది?

• డాక్టర్‌ దేవదాసు బెర్నార్డ్‌ రాజు

9866755024

Updated Date - 2023-05-05T02:49:51+05:30 IST