NRI: విమాన ప్రమాదంలో భారత సంతతి బిలియనీర్ దుర్మరణం
ABN , First Publish Date - 2023-10-02T22:19:07+05:30 IST
జింబాబ్వేలో ఇటీవల జరిగిన ఓ విమాన ప్రమాదంలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త హర్పాల్ రణ్ధావా ఆయన కుమారుడు అమర్ దుర్మరణం చెందారు.
ఎన్నారై డెస్క్: జింబాబ్వేలో ఇటీవల జరిగిన ఓ విమాన ప్రమాదంలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త హర్పాల్ రణ్ధావా ఆయన కుమారుడు అమర్ (23) దుర్మరణం చెందారు. తన సంస్థ రియోజిమ్కు చెందిన ప్రైవేటు విమానంలో హారారే నుంచి మురోవా వజ్రాల గనికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం కూలిపోయింది. సెప్టెంబర్ 29న జరిగిన ఈ ధుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం చెందారు.
మైనింగ్ రంగంలో విస్తృత అనుభవం ఉన్న హర్పాల్ రణ్దావా ఆఫ్రికాలో ప్రముఖ మైనింగ్ కంపెనీ రియోజిమ్ను నెలకొల్పారు. ఈ సంస్థకు బంగారం బొగ్గు గనులు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ సంస్థ నికెల్, కాపర్ వంటి ఖనిజాల శుద్ధీకరణ కూడా చేపడుతోంది. కాగా, మైనింగ్తో పాటు రణ్దావా ప్రైవేటు ఈక్విటీ వ్యాపారంలోకి కూడా ప్రవేశించారు. జీఈఎమ్ పేరిట ఓ సంస్థను నెలకొల్పారు.
కాగా, రణ్దావా మృతి గురించి ఆయన స్నేహితుడు, ప్రముఖ ఫిల్మ్మేకర్ హోప్వెల్ చినూఓ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆయన మృతిపై సంతాపం తెలిపారు. మిలియనీర్ అయినప్పటికీ రణ్దావా వినయశీలి అని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. జింబాబ్వేపై రణ్దావా చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.