Chandra Babu Case: మాట మార్చిన ముకుల్ రోహత్గీ.. అప్పుడలా.. ఇప్పుడిలా..!!
ABN , First Publish Date - 2023-09-21T03:01:19+05:30 IST
సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఒకే తరహా కేసుల్లో భిన్న వాదనలు వినిపించారు.
ఒకే తరహా కేసుల్లో రోహత్గీ భిన్న వాదనలు
యడ్యూరప్ప కేసులో సెక్షన్ 17(ఏ) వర్తిస్తుంది
చంద్రబాబు కేసులో ఈ సెక్షన్ వర్తించదట
సుప్రీం సీనియర్ న్యాయవాది
తీరుపై న్యాయనిపుణుల విస్మయం
అమరావతి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఒకే తరహా కేసుల్లో భిన్న వాదనలు వినిపించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తరఫున వాదించిన కేసులో ఒకలా, తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా సీఐడీ తరఫున మరోలా వాదనలు వినిపించారు. ఆయన తీరుపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఓ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసేందుకు తన కుమారుడు విజయేంద్ర ద్వారా యడ్యూరప్ప లంచం తీసుకున్నారని టీజే అబ్రహం అనే వ్యక్తి లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీంతో లోకాయుక్త విచారణ ప్రారంభించింది. ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరగా, యడ్యూరప్ప తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. పబ్లిక్ సర్వెంట్పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించే ముందు సంబంధిత అథారిటీ నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి అయిన యడ్యూరప్పకు సెక్షన్ 17(ఏ) వర్తిస్తుందన్నారు. దీంతో ధర్మాసనం యడ్యూరప్పపై లోకాయుక్త ప్రారంభించిన ప్రొసీడింగ్స్పై స్టే విధించింది. అదే తరహా ఆరోపణలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17(ఏ) చంద్రబాబుకు వర్తించదని వాదించారు. నేర ఘటన 2018కు ముందు జరిగినందున ఈ సెక్షన్ వర్తించదని పేర్కొన్నారు.