Virat Kohli: ఐపీఎల్‌ ఉత్తమ ఆటగాళ్లు ధోనీ, రోహిత్ శర్మ కాదట.. మరో ఇద్దరి పేర్లు చెప్పిన కోహ్లీ

ABN , First Publish Date - 2023-04-20T18:40:13+05:30 IST

ప్రపంచంలోని అత్యుత్తమ ప్లేయర్లలో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఒకడు. నిస్సందేహంగా ఈ

Virat Kohli: ఐపీఎల్‌ ఉత్తమ ఆటగాళ్లు ధోనీ, రోహిత్ శర్మ కాదట.. మరో ఇద్దరి పేర్లు చెప్పిన కోహ్లీ

బెంగళూరు: ప్రపంచంలోని అత్యుత్తమ ప్లేయర్లలో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఒకడు. నిస్సందేహంగా ఈ మాట చెప్పొచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL)లో మరెంతోమంది ఉత్తమ ఆటగాళ్లతో కలిసి కోహ్లీ ఆడాడు, ఆడుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఆటగాళ్లతో ఆడుతున్నాడు కదా.. మరి వారిలో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) ఎవరన్న ప్రశ్నకు కోహ్లీ ఆసక్తికర సమాధానం చెప్పాడు. ఐపీఎల్ వరకు వచ్చేసరికి ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, డ్వేన్ బ్రావో, సురేశ్ రైనా తదితర గొప్ప ఆటగాళ్ల పేర్లు వినిపిస్తాయి.

సాధారణంగా అత్యుత్తమ ఆటగాడు ఎవరన్న ప్రశ్నకు ధోనీ (Dhoni) లేదంటే రోహిత్ శర్మ(Rohit Sharma) పేరు చెబుతాడని ఊహిస్తే భిన్నమైన సమాధానం ఇచ్చాడు. ‘గోట్’ ఎవరన్న ప్రశ్నకు కోహ్లీ బదులిస్తూ ఇది చాలా కష్టమైన ప్రశ్న అని పేర్కొన్నాడు. ఒక్కరు కాదంటూ ఇద్దరి పేర్లు చెప్పాడు. వీరిలో ఒకరు దక్షిణాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్(AB de Villiers), రెండో ఆటగాడు శ్రీలంక మాజీ బౌలర్ లసిత్ మలింగ(Lasith Malinga).

నిజానికి డివిలియర్స్‌తో కోహ్లీ ప్రత్యేక అనుబంధం ఉంది. ఐపీఎల్‌లో ఇద్దరూ కలిసి చాలాకాలంపాటు ఆడారు. ఇప్పటికీ వీరిద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతోంది. డివిలియర్స్‌ను అత్యుత్తమ ఫినిషర్‌గా చెబుతారు. ఐపీఎల్‌లో మొత్తం 184 మ్యాచ్‌లు ఆడిన డివిలియర్స్ 39.71 సగటు, 151.69 స్ట్రైక్ రేట్‌తో 5,162 పరుగులు చేశాడు.

ఇక, మలింగ విషయానికి వస్తే.. ఈ శ్రీలంక మాజీ బౌలర్ నిజంగా చాలా ప్రమాదకరం. అతడిని నిరభ్యంతరంగా అత్యుత్తమ డెత్ బౌలర్‌గా చెప్పొచ్చు. ముంబై ఇండియన్స్‌కు ఆడినప్పుడు ఒంటి చేత్తో ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడు. తన ఐపీఎల్ కెరియర్ మొత్తం ముంబై ఇండియన్స్‌కే ఆడిన మలింగ 122 మ్యాచుల్లో 7.14 ఎకానమీతో 170 వికెట్లు తీసుకున్నాడు.

మరికొన్ని ప్రశ్నలకు కోహ్లీ ఇచ్చిన సమాధానాలు ఇవీ..

* తక్కువ రేటింగ్ కలిగిన ఆటగాడు - అంబటి రాయుడు

* గొప్ప ఆల్‌రౌండర్ - షేన్ వాట్సన్

* నరైన్-రషీద్‌లలో ఎవరు గొప్ప స్పిన్నర్ - రషీద్ ఖాన్

* టీ20ల్లో ఇష్టమైన షాట్ - పుల్ షాట్

* ఇష్టమైన ప్రత్యర్థి జట్టు - అభిమానులు ఎక్కువగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 208 మ్యాచుల్లో 6,411 పరుగులు చేశాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి కోహ్లీ ఒకే జట్టుకు ఆడుతున్నాడు.

Updated Date - 2023-04-20T18:40:13+05:30 IST